కాక రేపుతున్న కర్నాటక రాజకీయం.. బీజేపీకి వరుస షాక్ లు, జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ లో చేరనున్నారా?

Mahesh RajamoniUpdated : Apr 16 2023, 02:25 PM IST

Karnataka Assembly Elections 2023: రానున్న కర్ణాటకన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లింగాయత్ నేత తనపై ఒక క్రమబద్ధమైన కుట్ర జరుగుతోందనీ, పార్టీలో త‌న‌కు అవమానం జరిగిందని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న మ‌ద్ద‌తుదారుల‌తో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తున్నారు.   

Former Karnataka Chief Minister Jagadish Shettar: క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది రాష్ట్ర రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీదారులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు అభ్య‌ర్థుల విష‌యంలో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా బీజేపీకి రెబ‌ల్స్ బెడ‌ద పెరుగుతోంది. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి టిక్కెట్టు నిరాక‌రించ‌డంతో ప‌లువురు నాయ‌కులు ప్ర‌త్య‌క్షంగానే బీజేపీపై పోరుకు సిద్ద‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు కీల‌క నేత‌లు బీజేపీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా రానున్న కర్ణాటకన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త‌న ఎమ్మెల్యే ప‌దవికీ రాజీనామా చేశారు. లింగాయత్ నేత తనపై ఒక క్రమబద్ధమైన కుట్ర జరుగుతోందనీ, పార్టీలో త‌న‌కు అవమానం జరిగిందని పేర్కొన్నారు.

బీజేపీకి మరో షాక్..  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, పలుకుబడి కలిగిన లింగాయత్ నేత జగదీశ్ శెట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. తన తదుపరి చర్య గురించి శెట్టర్ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పుడు తన ముందు అన్ని ఎంపికలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. శెట్టర్ తన శ్రేయోభిలాషులతో బీజేపీని వీడి ఏ పార్టీలో చేరాలనే దానిపై చర్చిస్తున్నారు. ఆయ‌న కాంగ్రెస్ లో చేర‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌నీ, త‌న మ‌ద్ద‌తుదారుల‌తో చ‌ర్చ‌ల త‌ర్వాత భ‌విష్య‌త్ కార్యాచర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు. బీజేపీ వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. 

జ‌గ‌దీశ్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా?

ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు తనను సంప్రదించలేదని, అయితే కాంగ్రెస్ లో చేరే విషయంపై తన సన్నిహితులతో చర్చిస్తానని శెట్టర్ విలేకరులతో చెప్పారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీని సంప్రదిస్తారా అని అడిగినప్పుడు, ప్రధాని మోడీ లేదా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సంప్రదించే ప్రయత్నం చేయనని శెట్టర్ చెప్పారు. వారు ప్రధానిగా, కేంద్ర హోం మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నార‌నీ, ఏం జరుగుతోందో వాళ్లకే తెలియాలంటూ వ్యాఖ్యానించారు. 

బీజేపీపై విమ‌ర్శ‌లు 

పార్టీని నిర్మించిన సీనియర్లను కావాలనే అవమానిస్తున్నారని జ‌గ‌దీశ్ శెట్టర్ బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుంద‌న్నారు. రాష్ట్రంలో కొన్ని విషయాలను తేలిగ్గా తీసుకున్నారని పేర్కొన్నారు. సీనియర్లతో మాట్లాడే మర్యాద వారికి తెలియ‌ద‌నీ, దేశంలో లింగాయత్ నాయకత్వాన్ని బీజేపీ నాశనం చేస్తోందని శెట్టర్ విమ‌ర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీని బలిచేస్తున్నారన్నారు. కాగా, శెట్టర్ హుబ్లీ-ధార్వాడ్ (సెంట్రల్) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల అథని నియోజకవర్గం నుంచి టికెట్ నిరాకరించిన లక్ష్మణ్ సవాది కాంగ్రెస్ లో చేరి అదే నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్న సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ ను ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోందని స‌మాచారం.

Read more Articles on
click me!