వేలాది ఐఫోన్లు కొట్టేశారు.. రూ. 440 కోట్లు నష్టం...

By AN TeluguFirst Published Dec 14, 2020, 1:40 PM IST
Highlights

కర్ణాటకలో ఓ ఆపిల్ ఐఫోన్ తయారీ కంపెనీ జీతాలివ్వకపోవడంతో ఉద్యోగులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వేలాది ఫోన్లు మాయమయ్యాయని, రూ. 440 కోట్లు నష్టం వచ్చిందని కంపెనీ చెబుతోంది. కర్ణాటకలోని ఆపిల్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌లో వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహం‍తో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్లాంట్‌పై దాడిచేసిన సంగతి తెలిసిందే. 

కర్ణాటకలో ఓ ఆపిల్ ఐఫోన్ తయారీ కంపెనీ జీతాలివ్వకపోవడంతో ఉద్యోగులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వేలాది ఫోన్లు మాయమయ్యాయని, రూ. 440 కోట్లు నష్టం వచ్చిందని కంపెనీ చెబుతోంది. కర్ణాటకలోని ఆపిల్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌లో వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహం‍తో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్లాంట్‌పై దాడిచేసిన సంగతి తెలిసిందే. 

డిసెంబర్ 12న కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ప్లాంట్‌లో ఉద్యోగులు సృష్టించిన విధ్వంసంలో తమకు 440 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తాజాగా  తైవాన్ కు చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్  ప్రకటించింది.  ఫోన్లు ఎత్తుకెళ్లడంతో పాటు అసెంబ్లింగ్‌ పరికరాలు, బయోటెక్ డివైజ్‌లు ఇతర పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. 

బెంగళూరుకు  60 కిలోమీటర్ల దూరంలోని  కోలార్ జిల్లాలోని నర్సాపురలో తైవాన్‌ టెక్‌ దిగ్గజం విస్ట్రాన్ కార్పొరేషన్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.  గత కొద్ది రోజులుగా జీతాల విషయంలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. చివరికి  సహనం నశించి డిసెంబర్ 12న ప్లాంట్‌లో విధ్వంసానికి తెగబడ్డారు. 

కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పంటించారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటన జరిగిన వెంటనే సుమారు 100 మందికిపైగా ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ  విధ్వంసంలో సుమారు 700 కంప్యూటర్లు ధ్వంసమైనాయనీ, రూ.40కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని మొదట అంచనా వేశారు.

కాగా, ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విస్ట్రాన్, కాంట్రాక్టు కార్మికుల మధ్య వివాదం మూడు నెలలుగా కొనసాగుతోందని తెలిపింది. విస్ట్రాన్ తన కోలార్ యూనిట్ కోసం 8,900 మందిని నియమించుకోవడానికి ఆరు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాష్ట్ర కార్మిక మంత్రి శివరామ్ హెబ్బర్ తెలిపారు. 

అయితే ఈ నియామకాలకు సంబంధించి విస్ట్రాన్, కాంట్రాక్టర్లు,ఉద్యోగుల మధ్య ఏర్పడిన వివాదమే హింసకు కారణమై ఉండవచ్చని పరిశ్రమల మంత్రి జగదీష్ శెట్టర్ వ్యాఖ్యానించారు. కాగా కోలార్ జిల్లాలో నరసపుర ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న తైవానీస్ విస్ట్రాన్ కార్పొరేషన్ తయారీ కేంద్రం దేశంలోని మొట్టమొదటి ఐఫోన్ తయారీ కర్మాగారం.

click me!