దేశ రాజధాని ఢిల్లీలోకి నేటి ఉదయం భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. రాహుల్ గాంధీ సారథ్యంలో జరుగుతున్న ఈ యాత్రలో ఈ రోజు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీలో రాహుల్ గాంధీతోపాటు యాక్టర్ కమల్ హాసన్ అడుగు కలిపారు. మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు, చీఫ్ కమల్ హాసన్ ఈ రోజు ఢిల్లీలో ఈ యాత్రలో పాల్గొన్నారు.
జైరాం రమేశ్, పవన్ ఖేరా, భూపిందర్ సింగ్ హూడా, కుమారి సెల్జా, రణదీప్ సుర్జేవాలా సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీలు భారత్ జోడ్ యాత్రలో రాహుల్ గాంధీతోపాటు పాదయాత్ర చేశారు. భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొనడం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ నెలలో ఆమె కర్ణాటకలో రాహుల్ గాంధీతో పాదయాత్ర చేసిన సంగతి విధితమే.
ఈ రోజు ఉదయం ఫరీదాబాద్ మీదుగా భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ఎంటర్ అయింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి భారత్ జోడో యాత్రను స్వాగతించారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు బాదర్పూర్ బార్డర్ వద్ద ఇతర యాత్రికులకూ స్వాగతం పలికారు. రాహుల్ జిందాబాద్ నినాదాలతో భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించింది.
Superstar Kamal Haasan joins Rahul Gandhi in Bharat Jodo Yatra ⚡⚡💕 pic.twitter.com/UTang9y5IO
— Srinivas BV (@srinivasiyc)నఫ్రత్ కీ బాజార్ మే.. మొహబ్బత్ కీ దుకాణ్ ఖులా రహా.. అనే నినాదాన్ని రాహుల్ గాంధీ ఈ రోజు పునరుద్ఘాటిస్తూ ప్రసంగించారు. సగటు మనిషి నేడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడని అన్నారు. ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది ఈ యాత్రలో చేరారని తెలిపారు. ‘మీ విద్వేషపు సంతలో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నా’ అని తాను ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లకు చెప్పినట్టు వివరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు విద్వేషాన్ని వెదజల్లుతుంటే కాంగ్రెస్ ప్రేమను పంచుతున్నదని అన్నారు.