భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక, సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. నేడు సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ యూయూ లలిత్ 74 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఆయన నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత సీనియారిటీ జాబితాలో ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది.
జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబరు వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. ఆ మరుసటి ఏడాది ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది. 2014 ఆగస్టు 13న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనేక కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ కూడా భాగస్వామిగా ఉన్నారు.