
మానసిక పరిపత్వ సరిగా లేని వారే .. జాత్యహంకార, కుల అహంకార ఆలోచనలు చేస్తారనీ, వాటిని రెచ్చగొడుతారని సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టీస్ ఎన్ వి రమణ పేర్కొన్నారు. నేటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న 23వ తానా మహాసభల్లో జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగిస్తూ.. రాజకీయాల్లో వికృత ఘటనలు చూస్తున్నామని అన్నారు.
అమెరికాలోని భారతీయులు కష్టజీవులని, నిజాయితీ పరులని.. కానీ వారిలో ఐక్యత లేదనీ, కలహించుకుంటారని ఆ విషయం తనని బాధపెట్టిందని అన్నారు. ఇంత చదువులు చదివి, ఇంతింత అనుభవం గడించిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారాన్ని నమ్మి వినాశానికి ఊతమిస్తున్నామంటే.. రాబోయే తరాలు మనల్ని క్షమించవని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశంలో .. అందులో దక్షిణా భారతదేశంలో కుల వివక్ష తగ్గుతోందనీ, కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కానీ ప్రగతిశీల అమెరికా సమాజంలో నివసించే భారతీయ సంతతికి చెందిన వారు కులం, మతం అంటూ పొట్లాడుకోవడం సిగ్గుచేటని, ఆ విషయం తనని చాలా బాధపెట్టిందని అన్నారు.
ప్రజలతో సంబంధం లేనివారికి ఏం తెలుస్తాయి?
ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలెలా నడుపుతారని, వారికి రాజకీయాలు ఏం తెలుస్తాయని అన్నారు. రానురాను రాజకీయాల్లో ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ రాజకీయాల్లో విక్రుత ధోరణి ప్రారంభమైందనీ, రాజకీయ పార్టీల నిర్వహణ, ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ప్రజలతో సంబంధం లేనివారు రాజకీయాలు ఎలా చేస్తారని అన్నారు.
దుష్ప్రచారమే ఎన్నికల వ్యూహంగా మారిందని, మేనిఫెస్టో గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని, ఓటర్లను ప్రలోభలకు గురి చేస్తూ.. ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు.
విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం పరాజయం పాలవుతోందని మాజీ సుప్రీం చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత, మేధావులు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో నీతిమంతులు రాకపోతే.. అవినీతిపరులే నీతిలేని వారే రాజ్యమేలుతారని పేర్కొన్నారు. వారు చేతుల్లోకి అధికారం వెళ్తే.. వారు చేసే విధ్వంసాన్ని పూడ్చడానికి దశాబ్దాలు పడుతుందని వివరించారు.
ఎన్టీఆర్ కు భారత రత్న
ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చేవరకు తెలుగువారు పోరాడాలని పిలుపు ఇచ్చారు. విద్యార్థులను రాజకీయాలకు దూరం చేయడం వల్లే అథోగతి పాలవుతున్నామని,. కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని జస్టిస్ ఎన్.వి. రమణ పిలుపు ఇచ్చారు. అమెరికాలోని తానా సభల్లో ఆయన చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది.