
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జవహార్లాల్ నెహ్రు యూనివర్శిటీ విద్యార్థి ఉమర్ ఖలీద్పై సోమవారం నాడు కాల్పులు జరిగాయి. హై సెక్యూరిటీ జోన్లో ఈ కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో ఉమర్ ఖలీద్ ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు. ఖలీద్పై కాల్పులకు దిగిన దుండగుడు పారిపోయాడు.
జెఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ సెంట్రల్ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఖలీద్ను లక్ష్యంగా చేసుకొని దుండగులు కాల్పులు జరిపారు. అయితే కాల్పులను పసిగట్టిన ఖలీద్ తప్పించుకొన్నాడు.
దుండగుడు కాల్పులు జరుపుతున్న విషయాన్ని గుర్తంచిన ఖలీద్ చివరి నిమిషంలో కిందకు వంగిపోయాడు. ఆ సమయంలో మా మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఆ సమయంలో ఖలీద్ కిందపడిపోయాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
తామంతా టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న సమయంలో ఖలీద్ ను లక్ష్యంగా చేసుకొన్న ఓ దుండగుడు తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఖలీద్ తప్పించుకొన్నాడు.
నిందితుడిని పట్టుకొనేందుకు తాము ప్రయత్నించగా నిందితుడు పారిపోయినట్టు చెప్పారు. అయితే నిందితుడు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకొన్నట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.