
Kashmir Encounter: జమ్ము కశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్(జేఈఎం) కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడు. ఈ ఎన్ కౌంటర్లు జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్, పుల్వామా జిల్లాల్లో జరిగినట్లు భద్రతా బలగాలు తెలిపాయి.
కశ్మీర్లోని బుడ్గాం జిల్లాలోని చరర్ ఐ షరీఫ్ ప్రాంతంలో, పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు 12 గంటలపాటు జరిగిన ఈ
ఎన్కౌంటర్లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారనీ, వారు పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్లకు అనుబంధంగా పనిచేస్తున్నారని కాశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఏకే-56 తుపాకులను స్వాధీనం చేసుకున్నాం. ఉగ్రవాదులు జేఈఎం, ఎల్ఈటీ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారుగా గుర్తించాం. మృతుల్లో జేఎం కమాండర్ జాహిద్ వనీ, ఒక పాకిస్తానీ ఉగ్రవాది ఉన్నారని, ఇది భద్రతా బలగాలకు పెద్ద విజయం అని కుమార్ అన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు జరిగిన 11 ఎన్కౌంటర్లలో పాకిస్థాన్కు చెందిన ఎనిమిది మందితో సహా మొత్తం 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన తెలిపారు.
పుల్వామాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారం సాయంత్రం ఎన్కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారనీ, ఘటనా స్థలం లో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అలాగే.. సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలోని చరర్-ఇ-షరీఫ్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా చెందిన ఓ ఉగ్రవాది హతం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే 56 రైఫిల్తో సహా నిందితులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
శనివారం తెల్లవారుజామున అనంత్నాగ్లోని బిజ్బెహరా ప్రాంతంలోని అలీ మహ్మద్ గనీ అనే హెడ్ కానిస్టేబుల్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన చిక్సిత పొందుతూ మరణించారు.
ఈ ఘటనపై జమ్ము కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. అనంతనాగ్ జిల్లాలో పోలీసు హెచ్సి అలీ మహ్మద్ పై ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన అత్యున్నత త్యాగం వృథాపోదనీ, . ఈ అనాగరిక చర్యకు పాల్పడిన నిందితులకు త్వరలో శిక్ష పడుతుందనీ, అమరవీరుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.