
Cylinder blast in Jammu : జమ్ముకశ్మీర్లో సోమవారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. జమ్ము రెసిడెన్సీ రోడ్డులోని ఓ వ్యర్థాల దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఆ మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే షాపులోని ఉన్న గ్యాస్ సిలిండర్ ఓసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆ ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరినట్టు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఘటన జరిగినప్పుడు భారీ పేలుడు శబ్దాలతో పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. ఏం జరుగుతోందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనలో ఓ చిన్నారి సహా నలుగురు చనిపోగా..15మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ బిల్డింగ్ లో నివసిస్తున్నవారిలో చాలామంది అసోం రాష్ట్రానికి చెందినవారని తెలుస్తోంది. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1లక్ష, స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ. 25వేలు ఇస్తామని హామీనిచ్చారు.