
Terror Funding Case: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నేత షబీర్ అహ్మద్ షాకు చెందిన రూ.21.80 లక్షల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. యూఏపీఏ (ఉపా)లోని వివిధ సెక్షన్ల కింద లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, ఇతరులపై 2017 మేలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ నుండి మనీలాండరింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే టెర్రర్ ఫండింగ్ కేసులో ఈడీ పలువురి ఆస్తులను అటాచ్ చేసింది.
వివరాల్లోకెళ్తే.. కేంద్ర పాలిత ప్రాంతంమైన జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆజ్యం పోసిన కేసులో మనీలాండరింగ్ విచారణలో భాగంగా జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ అహ్మద్ షా శ్రీనగర్ ఇంటిని అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తెలియజేసింది. శ్రీనగర్లోని బార్జుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్ నగర్లోని బోత్షా కాలనీలో రూ. 21.80 లక్షల విలువైన ఇల్లు ఉందని ఈడీ ట్వీట్లో పేర్కొంది.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని వివిధ సెక్షన్ల కింద లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, ఇతరులపై 2017 మేలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ నుండి షబీర్ షాపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. "రాళ్ల దాడులు, ఊరేగింపులు, నిరసనలు, బంద్లు, హర్తాళ్లు, ఇతర విధ్వంసక చర్యల ద్వారా కాశ్మీర్ లోయలో అశాంతికి ఆజ్యం పోసే కార్యకలాపాలలో షబీర్ అహ్మద్ షా చురుకుగా పాల్గొన్నాడు" అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.
అలాగే, "అతను తీవ్రవాద సంస్థ హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ (HM), పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఇతర తీవ్రవాద సంస్థలు, అలాగే పాకిస్తాన్ సంస్థ నుండి హవాలా మార్గాల్లోనూ, అనేక ఇతర మార్గాలు నిధులు పొందడంలో పాలుపంచుకున్నాడు. ఈ నిధులను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, ఇంధనంకు ఉపయోగించాడు. కశ్మీర్ లోయలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా చర్యలకు పాల్పడ్డారు" అని ఈడీ ప్రకటన పేర్కొంది. 1998లో షబీర్ షా జమ్మూ అండ్ కాశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ (JKDFP)ని స్థాపించాడు. ఇది కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారం అందించాలనే నిర్ణయాన్ని సమర్థిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా, షబీర్ షా ఇదివరకు చాలా సార్లు అరెస్టు చేయబడ్డారు. చివరిగా 2015లో గృహనిర్బంధంలో ఉంచబడ్డాడు. కాగా, ప్రస్తుత టెర్రర్ ఫండింగ్ కేసులో మరింత లోతుగా విచారణ కొనసాగుతున్నదని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. గత కొంత కాలంగా టెర్రర్ కార్యకలాపాలు తగ్గుముఖంలో ఉండగా, మళ్లీ జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకాలపాలు పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.