
Earthquake in Arunachal Pradesh: ఈశాన్య భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. ఆదివారం సంభవించిన ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో నమోదైంది. ఇదే సమయంలో అస్సాం, భూటాన్ తూర్పు భాగంలో కూడా ప్రకంపనలు సంభవించాయి.
ఈశాన్య భారత ప్రాంతం అధిక భూకంప జోన్ పరిధిలోకి వస్తుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, మధ్యాహ్నం 12.12 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
భూటాన్ సరిహద్దుకు సమీపంలోని వెస్ట్ కమెంగ్ లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మధ్య ఉత్తర అస్సాం, భూటాన్ తూర్పు ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు, ఆస్తి నష్టం జరిగినదానికి సంబంధించి తమకు సమాచారం ఇంకా అందలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈశాన్య ప్రాంతం అధిక భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది, ఇది అక్కడ తరచుగా భూకంపాలు సంభవించే దృగ్విషయంగా నిపుణులు పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ లోనూ భూకంపం..
మధ్యప్రదేశ్ లో ఆదివారం నాడు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఇండోర్ సంభవించిన ఈ ప్రకంపన ప్రభావం రిక్టర్ స్కేల్ పై 3.0 తీవ్రతతో నమోదైంది.
సూర్యపేటలోనూ ప్రకంపనలు..
తెలంగాణంలోని సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భూ ప్రకంపనలు సంభవించాయి. పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూకంపం వచ్చిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెర్వు, హుజూర్నగర్లలో భూ ప్రకంపనలు ప్రభావం కనిపించిందని సమాచారం. రిక్టర్ స్కేల్ పై 3.2 గా భూకంప తీవ్రత నమోదైంది. ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉదయం 7.25 గంటలకు 10 సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురై ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చింతలపాలెం మండలంలో తరుచుగా స్వల్ప ప్రకంపనలు వస్తుండటంతో చింతలపాలెం మండలం పాతవెల్లటూరులో జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా సీస్మోగ్రఫీ మీటర్ను ఏర్పాటు చేసింది.