
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీతో బుధవారం మధ్యాహ్నం సమావేశం అయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఇద్దరు నేతల మధ్య సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశం అయ్యింది. ఈ సమావేశంలో రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ శరద్ పవర్ మీడియాతో సమావేశంలో జరిగిన చర్చపై వివరించారు.
బీజేపీని విమర్శించే నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపడుతున్న చర్యలపై తాను ప్రధాని ఎదుట అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇది సరైంది కాదని, అన్యాయమని మోడీతో చెప్పానని అన్నారు. ‘‘ ఏ ప్రాతిపదికన సంజయ్ రౌత్పై చర్య తీసుకున్నారు ? ఇది అన్యాయం. అతడు బీజేపీపై విమర్శలు, ప్రకటనలు చేస్తున్నందునే ఇలా చేస్తున్నారు. ’’ అని తాను ప్రధాని మోడీతో చర్చించానని శరద్ పవార్ తెలిపారు.
బుధవారం ఉదయం ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. అలాగే గతంలో అదే పార్టీకి చెందిన మరో నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల కిందట శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీకి సంబంధించిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇలా మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో, శరాద్ పవార్ చర్చ జరిగింది.
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీకి గతంలో చాలా సానిహిత్యం ఉండేది. అయితే 2019 ఎన్నికల సమయంలో సీఎం పీఠం విషయంలో రెండు పార్టీలు విడిపోయాయి. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎంవీఏ (మహా వికాస్ అఘాడి)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నిన్న ప్రధాని చర్చ సందర్భంగా ఈ విషయాన్ని కూడా శరాద్ పవర్ లేవనెత్తారు. ఎంవీఏలో ఎలాంటి గందరగోళం ఏర్పడలేదని ఆయన అన్నారు. ‘‘ మేము వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతాం. MVA (మహా వికాస్ అఘాడి) స్థిరత్వం ఉంది. నేను గత రెండున్నరేళ్లుగా ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాను ’’ అని శరాద్ పవార్ అన్నారు.