
Himanta Biswa Sharma fires on Rahul Gandhi: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం రాజకీయ దుమారం రేపుతోంది. మరోసారి ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. విదేశీ గడ్డపై భారత్ ను కించపర్చే దుందుడుకు ప్రయత్నమంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇదివరకు విదేశీయులు దాడి చేస్తే.. ఇప్పుడు స్వంత వ్యక్తులు సైతం భారత్ ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.
వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తన ప్రసంగంలో భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచివుందనీ, తనతో సహా అనేక మంది రాజకీయ నాయకులు ప్రభుత్వ నిఘాలో ఉన్నారని ఆరోపించడంతో పాటు పలు విమర్శలు గుప్పించారు. భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉందనీ, ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారని ఆరోపించారు. అలాగే, పార్లమెంటు, పత్రికా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ ఇలా అన్నింటిపై దాడి జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే అసోం సీఎం హిమంత బిశ్వశర్మ.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో భారత్ ను కించపరిచే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు.
శర్మ తన ట్వీట్ లో "మొదటి విదేశీ ఏజెంట్లు మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు ! అప్పుడు మన స్వంత దేశం (రాహుల్ గాంధీ) మనల్ని పరాయి భూమిపై టార్గెట్ చేసింది ! కేంబ్రిడ్జ్లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ఆదరణీయ ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకునే ముసుగులో విదేశీ గడ్డపై మన దేశాన్ని కించపరిచే ధృడమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు" అంటూ విమర్శించారు.
అలాగే, భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాహుల్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. మోడీ ప్రభుత్వం అందించిన రక్షణలోనే ఆయన తన భారత్ జోడో యాత్రలో 4,000 కిలో మీటర్లు ఏ ప్రమాదం లేకుండా ప్రయాణించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు తలపెట్టిన యాత్రలను ఎలా విధ్వంసం చేశారో ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందా? అంటూ మండిపడ్డారు.
పెగాసస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సైతం ప్రస్తావిస్తూ శర్మ వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. తన ఫోన్లో స్పైవేర్ పెగాసస్ కనిపించిందనీ, దీనిపై ఓ అధికారి తనను హెచ్చరించారని రాహుల్ చెప్పారని పేర్కొంటూ.. విచారణకు రాహుల్ గాంధీ తన ఫోన్ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. "సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఆయన తన ఫోన్ ను విచారణకు సమర్పించడానికి నిరాకరించారు. విస్తృత దర్యాప్తు అనంతరం పెగాసస్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తేల్చింది" దని శర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
దేశంలో మైనారిటీలు అసురక్షితంగా ఉన్నారనీ, వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని రాహుల్ పేర్కొన్న వ్యాఖ్యలలో వాస్తవం లేదని శర్మ అన్నారు. "2014 మే నుండి, భారతదేశంలో మత హింస చాలా వరకు తగ్గిపోయింది. మైనారిటీ కుటుంబాల శ్రేయస్సు ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉంది. చాలా మంది మైనారిటీ నేతలు మోడీ ప్రభుత్వంపై విశ్వాసం" ఉంచారు అని అసోం సీఎం పేర్కొన్నారు.