న్యూ ఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక అడుగుకు సిద్ధమైంది. మే 18, 2025న ఉదయం 5:59 గంటలకు, ఇస్రో తన తాజా EOS-09 భూ పరిశీలన ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతోంది. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరగనుంది.ఇప్పటికే PSLV-C61 రాకెట్ను చివరి దశలో ఇంటిగ్రేషన్, టెక్నికల్ చెక్స్ కోసం మొబైల్ సర్వీస్ టవర్ వద్దకు తరలించారు. ఇది ఇస్రో ప్రయోగాలకు ముందు జరిగే సాధారణ కానీ కీలకమైన ప్రక్రియ. EOS-09 ఉపగ్రహం ఇస్రో చేత ఇప్పటి వరకు తయారుచేసిన 101వ ఉపగ్రహం కావడం గమనార్హం.
ఈ ఉపగ్రహానికి సంబంధించి మాజీ ఇస్రో శాస్త్రవేత్త మనీష్ పురోహిత్ ఇచ్చిన వివరాల ప్రకారం, EOS-09 అనేది RISAT-1 మిషన్కు కొనసాగింపు. ఈ మిషన్ సమయాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో పహల్గాం ఉగ్రవాద దాడి వంటి ఘటనల తర్వాత ఈ ఉపగ్రహం సరిహద్దు మారుప్రాంతాలు, తీర ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించడంలో సహాయపడనుంది. ఇది ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.
ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఈ ఉపగ్రహ ప్రయోగం ద్వారా టెక్నాలజీతో పాటు జాతీయ భద్రత కోసం ఇస్రో చేస్తున్న కృషిని హైలైట్ చేశారు. దేశ ప్రయోజనాల కోసం ఇస్రో చేసే కృషికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఇంతేకాకుండా, ఇస్రో త్వరలో NASAతో కలసి రూపొందించిన NISAR ఉపగ్రహాన్ని కూడా GSLV-F16 ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఉపగ్రహం భూమిపై జరిగే మార్పులను, పర్యావరణ పరిస్థితులను అంచనా వేసే అత్యాధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేయబడింది.
EOS-09లో అత్యాధునిక సీ-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇది వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, చీకటి అయినా పగలైనా తేడా లేకుండా భూమి ఉపరితలాన్ని స్పష్టంగా పర్యవేక్షించగలదు. దీని వల్ల వ్యవసాయం, సురక్షిత నిర్వహణ, విపత్తులపై త్వరిత సమాచారం వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది.
ఇస్రో ఈ కొత్త ఉపగ్రహం ద్వారా భారత్ అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు వేసింది. భవిష్యత్తులో దేశ రక్షణ అవసరాలకు తోడు పర్యావరణంపై అప్రమత్తతను పెంచే దిశగా ఇది సహాయపడనుంది