కరోనా మళ్లీ ముప్పుగా మారుతోందా అనే అనుమానాలు తాజాగా ఉన్న పరిస్థితుల్లో కొత్త వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని వారాలుగా ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడం గమనార్హం. హాంకాంగ్, సింగపూర్ లాంటి దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆరోగ్య శాఖల నివేదికలు వెల్లడిస్తున్నాయి.
హాంకాంగ్లో మే 3వ తేదీ నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, వైరస్ వల్ల మృతుల సంఖ్య కూడా పెరుగుతోందని అక్కడి ఆరోగ్య అధికారులు వివరించారు.. నగర జనాభా దాదాపు 70 లక్షలుగా ఉండగా, గత ఏడాది కంటే ఈసారి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య అధికమవుతోందని, ముఖ్యంగా పెద్దవారిలో తీవ్ర ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయని వివరించారు.
అదే విధంగా సింగపూర్లోనూ మే మొదటి వారంలో కొత్త కేసుల సంఖ్య 14,200కి చేరింది. ఇది గత వారం కంటే 28 శాతం అధికమని సమాచారం. ఆసుపత్రిలో చేరే పేషెంట్ల సంఖ్య సైతం దాదాపు 30 శాతం పెరిగిందని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ పెరుగుదలకు కారణం జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడమేనని అంచనా.
చైనాలోనూ అదే దిశగా పరిణామాలు కనిపిస్తున్నాయి. అక్కడ గత ఐదు వారాల డేటా ప్రకారం ప్రధాన ఆసుపత్రుల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. ఇది గత సంవత్సరం వేసవిలోని తీవ్ర స్థితిని తలపిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గ్లోబల్ డేటాలో కోవిడ్ పాజిటివిటీ రేటు 7.3 శాతం నుంచి 5 శాతానికి తగ్గినా, కొన్ని ప్రాంతాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని హెచ్చరించింది. ప్రస్తుతం వైరస్ కొత్త వేరియంట్ అయిన JN.1 ఎక్కువగా విజృంభిస్తోంది. ఇది Variants of Interest (VOI) జాబితాలో చేరింది. 2025లో నమోదైన వైరల్ సీక్వెన్స్లలో దీని ప్రాబల్యం 16.3 శాతంగా ఉంది. అలాగే LP.8.1, LB.1 వేరియంట్లు కూడా కనిపిస్తున్నాయి.
ఇక భారత్ విషయానికి వస్తే, తాజాగా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని అంచనాలు ఉన్నాయి. వృద్ధులు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన "హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025" నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరిశీలించిన అనంతరం శ్వాసకోశ సంబంధిత సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్టు తేలింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, ప్రజాభారణ ఎక్కువగా ఉండే ప్రదేశాలను నివారించడం, అవసరమైతే టెస్టింగ్ చేయించుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.