డిసెంబర్ 12న ఈషా- ఆనంద్ ల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. వివాహం అనంతరం నూతన దంపతులు ఇదే భవనంలో నివసించనున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ముద్దుల కుమార్తె ఈషాకు అత్తింటి నుంచి అద్భుతమైన కానుక అందనుంది. ముంబయిలోని వర్లీ ప్రాంతంలో పిరమాల్ కుటుంబం పేరిట ఉన్న రూ.450కోట్ల విలువైన గులీటా భవనాన్ని ఈషాకి అత్తింటి వారు కానుకగా ఇవ్వనున్నారు.
డిసెంబర్ 12న ఈషా- ఆనంద్ ల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. వివాహం అనంతరం నూతన దంపతులు ఇదే భవనంలో నివసించనున్నారు. వర్లీలోని హిందుస్థాన్ యూనిలీవర్కు చెందిన ఈ భవనాన్ని 2012లో జరిగిన వేలంలో పిరమాల్ కుటుంబం దక్కించుకొంది.
అప్పటి నుంచి దీన్ని వివిధ రకాల శిక్షణ కేంద్రాలకు వినియోగిస్తున్నారు. ఆరేళ్ల క్రితం వేలంలో దీన్ని దక్కించుకున్నా.. పూర్తి హక్కులు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 19న పిరమాల్ కుటుంబానికి బదిలీ అయ్యాయి.
ముంబయిలో అత్యంత పేరున్న భవనమంటే యాంటిలియానే. ఇప్పుడు గులీటా కూడా ఈ జాబితాలో చేరనుంది. గులీటా 50,000చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో విశాలమైన లాన్, మల్టీపర్సస్ గదులు, ఓపెన్ ఎయిర్ వాటర్ బాడీ సదుపాయాలుంటాయి.
మిగిలిన అంతస్తుల్లో లివింగ్ రూమ్, భోజనశాలలు, బెడ్రూమ్స్, ట్రిపుల్ హైట్ మల్టీపర్సస్ గదులు ఉన్నాయి. అక్కడే లాంజ్ ఏరియాలు, డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయి. పనివారి క్వార్టర్లు సైతం అక్కడే ఉన్నాయి. డిసెంబర్ 1న ఈ భవనంలో పూజ నిర్వహించనున్నారు. వివాహం అనంతరం డిసెంబర్ 12న నూతన దంపతులు దీనిలోకి ప్రవేశించనున్నారు. ప్రస్తుతం భవన సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.