ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగడంతో విమానాన్ని వెంటనే నిలిపివేసారు. ఈ ఘటన ఢిల్లీ విమనాశ్రయంలో శుక్రవారం రాత్రి జరిగింది.
ఇండిగో విమానంలో మంటలు చెలరేగాయి. టేకాఫ్కు ముందు ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.వెంటనే ప్రయాణీకులను , సిబ్బందిని విమానం నుంచి కిందకు దింపేశారు. వారందరినీ సురక్షతంగా టెర్మినల్ భవానానికి తరలించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఢిల్లీ నుండి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం (6E-2131)లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. విమానంలో కూర్చున్న ప్రయాణికులు కిటికీలోంచి ఇంజన్ మంటలు రావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలోనే విమానాన్ని నిలిపివేశారు. విమానం టేకాఫ్ కాలేదని అధికారులు తెలిపారు.
ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం
ఈ ఘటనపై ఇండిగో విమానయాన సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న 6E2131 విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. కాసేపటికే పైలట్ టేకాఫ్ను నిలిపివేశాడు. ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్లైన్స్ తెలిపింది. ప్రయాణీకుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ఇండిగో ప్రకటించింది.
గత కొన్ని నెలలుగా..అనేక విమానాలలో సాంకేతిక లోపాలు తలెత్తున్నాయి. పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్లు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా స్పైస్జెట్ విమానాల్లో గరిష్ఠ సంఖ్యలో అవాంతరాలు తలెత్తాయి.ఇండిగో,ఎయిరిండియా విమానాల్లో కూడా సాంకేతిక లోపాలు వెలుగులోకి వచ్చాయి. తాజా కేసులో ప్రమాదం గల కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు.
IndiGo Flight, Engine Catches Fire During Take-Off, Visuals From IGI Airport pic.twitter.com/YVJzLVUKkU
— Vaibhav Singh (@v_singh97)ఆకాసా ఎయిర్ విమానాన్ని ఢీకొట్టిన పక్షి
ఈ ఘటనకు ఒకరోజు ముందు ఆకాసా ఎయిర్ విమానానికి ప్రమాదం జరిగింది. గురువారం అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆకాసా ఎయిర్ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బోయింగ్ 737 MAX విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, రాగానే ప్రయాణికులందరూ ఆఫ్లోడ్ అయ్యారని ఎయిర్లైన్స్ తెలిపింది.
స్పైస్జెట్కు చెందిన సగం విమానాలపై నిషేధం
స్పెస్ జెట్ లో పలుమార్లు సాంకేతిక లోపాలు వెలుగులోకి రావడంతో డీజీసీఏ సీరియస్ అయ్యింది. జూలైలో పలు స్పైస్జెట్ విమానాలపై డీజీసీఏ నిషేధం విధించింది. ఆ సమయంలో 18 రోజుల వ్యవధిలో స్పైస్జెట్ విమానాలలో ఎనిమిది అవాంతరాల కేసులు నమోదయ్యాయి. దీని తరువాత.. డీజీసీఏ జూలై 6 న ఆ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.