
ఎయిర్ వేస్ లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు మరణించారు . ఒకరు విమానాశ్రయంలో ప్రాణాలు కోల్పోగా.. మరొకరు విమానంలో గుండెపోటు రావడం వల్ల మరణించాడు.
వివరాల్లోకెళ్లే.. నాగపూర్ నుంచి పూణే కు వెళ్లే ఇండిగో విమానంలో విధులు నిర్వర్తించాల్సిన ఓ పైలెట్... నాగపూర్ విమానాశ్రయం బోర్డింగ్ గేటు వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఉన్నట్టు ఉండి.. ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో అతడ్ని వెంటనే హాస్పిటల్కు తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ పైలెట్ అప్పటికే మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఇండిగో విమానానికి ఆయన కెప్టెన్ గా వ్యవహరిస్తున్నట్టు ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు.
ఇండిగో ఎయిర్లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. విమానాశ్రయంలోని భద్రతా ఏరియాలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో కెప్టెన్ మనోజ్ సుబ్రమణ్యం స్పృహతప్పి పడిపోయారు. దీంతో అతడ్ని కిమ్స్-కింగ్స్వే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గత 48 గంటల్లో ఇద్దరు భారతీయ పైలట్లు హఠాన్మరణం చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆసుపత్రి ప్రతినిధి ఎజాజ్ షమీ మీడియాతో మాట్లాడుతూ.. అత్యవసర బృందం మనోజ్కు చికిత్స చేయడానికి ప్రయత్నించింది, అయితే అతను స్పందించలేదు. పైలట్ మనోజ్ సుబ్రమణ్యం గుండెపోటుతో మరణించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఇండిగో తన ప్రకటనలో ఇలా పేర్కొంది. ఈరోజు నాగ్పూర్లో మా పైలట్లలో ఒకరు మరణించడం బాధ కలిగించింది. నాగ్పూర్ విమానాశ్రయంలో అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా, దురదృష్టవశాత్తు మరణించారు. అతని కుటుంబానికి , ప్రియమైనవారికి మా సానుభూతి అని పేర్కొంది.
రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు పైలెట్ల మృతి
రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు భారత పైలెట్ల మృతి చెందారు. ఖతార్ ఎయిర్వేస్కు చెందిన అనుభవజ్ఞుడైన పైలట్ మరణించారు. బుధవారం ఢిల్లీ నుండి దోహాకు వెళ్తున్న విమానంలో అదనపు సిబ్బందిలో ఆయన ఒకరిగా ఉన్నారు. విమానంలో ప్రయాణికుల క్యాబిన్ లో కూర్చుని ఉండగా.. గుండెపోటుకు గురయ్యారు. ఆయనను బతికించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి