‘‘ మీకు భారతీయ ముస్లింల వందనం ’’.. తాలిబన్లపై ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్ ప్రశంసలు

By Siva KodatiFirst Published Aug 18, 2021, 6:29 PM IST
Highlights

ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం సమర్థనీయమేనన్నారు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యుడు మౌలానా సజ్జాద్ నోమని. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సైన్యాలతో నిరాయుధులైన జాతి ఎలా పోరాడిందో యావత్తు ప్రపంచం చూసిందని గుర్తుచేశారు. 

ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యుడు మౌలానా సజ్జాద్ నోమని ప్రశంసలు కురిపించారు. భారతీయ ముస్లింలు మీకు వందనం చేస్తున్నారు అంటూ ఆయన ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. తాలిబన్ల చర్యలను సమర్థిస్తూ, వారు ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దళాలను ఓడించారని సజ్జాద్ ప్రశంసించారు. ఈ కుర్రాళ్ళు కాబూల్ గడ్డను ముద్దు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం సమర్థనీయమేనన్న ఆయన ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సైన్యాలతో నిరాయుధులైన జాతి ఎలా పోరాడిందో యావత్తు ప్రపంచం చూసిందని గుర్తుచేశారు. వారిలో ఎటువంటి అహంకారం లేదని.. పెద్ద పెద్ద మాటలు లేవు అని సజ్జాద్ పేర్కొన్నారు.

ALso Read:తాలిబన్లు.. భారత స్వాతంత్య్ర సమరయోధుల వంటి వారేనట: సమాజ్‌వాదీ ఎంపీపై దేశద్రోహం కేసు 

అంతకుముందు తాలిబ‌న్ల‌ను భార‌త స్వాతంత్య్ర‌ సమర యోధులతో పోల్చిన ఆరోప‌ణ‌ల‌పై ఓ ఎంపీ స‌హా ముగ్గురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. తాలిబ‌న్లు చేసిన పోరాటాన్ని భార‌త స్వాతంత్య్ర సంగ్రామంతో పోల్చుతూ ఇటీవ‌ల సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్ వ్యాఖ్య‌ానించిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

అమెరికా, ర‌ష్యా త‌మ దేశం విష‌యంలో జోక్యం చేసుకోకుండా ఆఫ్ఘ‌న్‌లోని తాలిబ‌న్లు నిరోధించార‌ని రహ్మన్ ప్రశంసించారు. ఆఫ్ఘ‌న్‌ స్వేచ్ఛగా వుండాలని, తాలిబ‌న్లు దేశాన్ని పాలించాలని తాను కోరుకుంటున్నానని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే, మ‌రో ఇద్ద‌రు కూడా తాలిబ‌న్ల‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేశారు. అయితే అహింసా మార్గంలో శాంతియుతంగా జరిగిన భార‌త స్వాతంత్య్ర సంగ్రామంతో తాలిబన్ల చ‌ర్య‌ల‌ను పోల్చ‌డ‌ంపై ప‌లువురు భగ్గుమన్నారు. వారిపై ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఎంపీ సహా ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదు చేశామ‌ని చంబల్ జిల్లా పోలీసులు తెలిపారు.

click me!