కరోనా సెకండ్ వేవ్ : ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి... !!

By AN TeluguFirst Published May 4, 2021, 4:57 PM IST
Highlights

కరోనా రెండో దశ విలయం సృష్టిస్తోంది. ప్రతిరోజు మూడు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. రెండో దశ వైరస్ మొదటి దశ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావం ఉందని ఓ పరిశోధనల్లో వెల్లడైంది.

కరోనా రెండో దశ విలయం సృష్టిస్తోంది. ప్రతిరోజు మూడు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. రెండో దశ వైరస్ మొదటి దశ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావం ఉందని ఓ పరిశోధనల్లో వెల్లడైంది.

ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్ వ్యాపిస్తుందని సదరు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిర్వహించిన పరిశోధన గణాంకాలు ఈ విషయాలను పేర్కొంటున్నాయి.

‘ఈ రెండో దశలో అనేకమంది వైరస్ బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శనం’ అని టీఐఎఫ్ఆర్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సందీప్ జునేజా వెల్లడించారు. 

ముంబైలో కరోనా మరణాలు అధికంగా నమోదవడానికి కారణాలను పరిశోధిస్తున్నామని సర్వే తెలిపింది. మహారాష్ట్రలో రెండో దశ వైరస్ ఫిబ్రవరి నెలలోనే వ్యాప్తి చెందిందని.. లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించడంతో అది విజృంభించిందని పేర్కొంది. 

మే మొదటి వారంలో ముంబైలో మరణాలు అధికంగా ఉంటాయని, వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగితే జూన్ 1 నాటికి మరణాల సంఖ్య తగ్గుతుందని సర్వే తెలిపింది.

దేశంలో సోమవారం ఒక్కరోజే 3,57,229మందికి ఈ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 3,449మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశంలో 2,22,408 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 48, 621 మందికి వైరస్ సోకగా, 567 మంది ప్రాణాలు కోల్పోయారు.

click me!