కుదుటపడని ఢిల్లీ.. పేదలకు కేజ్రీవాల్ ఆపన్నహస్తం: ఉచిత రేషన్, ఆటోడ్రైవర్లకు రూ.5 వేలు

By Siva KodatiFirst Published May 4, 2021, 4:09 PM IST
Highlights

 వచ్చే రెండు నెలలపాటు రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ ఉచిత రేషన్‌ అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 72 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందని సీఎం ప్రకటించారు. అదే  సమయంలో రాబోయే రెండు నెలలు వరకు లాక్‌డౌన్‌ ఉండదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. 

కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న ఢిల్లీలో వైరస్‌ను కట్టడి చేసేందుక  అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. పరిస్ధితులు ఏ మాత్రం కుదటపడక పోవడంతో ఈ ఆంక్షలను మే 10 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు, ఇతర వర్గాలను ఆదుకునేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే వేలాది కుటుంబాలు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని వచ్చే రెండు నెలలపాటు రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ ఉచిత రేషన్‌ అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 72 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందని సీఎం ప్రకటించారు. అదే  సమయంలో రాబోయే రెండు నెలలు వరకు లాక్‌డౌన్‌ ఉండదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. 

Also Read:కరోనా ఎఫెక్ట్: నీట్ పరీక్షల వాయిదా

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వ సాయం వారికి ఆర్థికంగా కొంత ఊరట కలిగిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

గతేడాది లాక్‌డౌన్‌ విధించిన సమయంలోనూ వీరికి ఢిల్లీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. దీనివల్ల దాదాపు లక్షన్నర మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు లబ్ధిపొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.  

మరోవైపు ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 18 వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. రోజువారీ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ కొవిడ్‌ మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 448 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 17వేలు దాటింది.  

click me!