Corona Update: దేశంలో కొత్తగా 2,539 కేసులు.. 60 మరణాలు

Published : Mar 17, 2022, 11:24 AM ISTUpdated : Mar 17, 2022, 11:27 AM IST
Corona Update: దేశంలో కొత్తగా 2,539 కేసులు.. 60 మరణాలు

సారాంశం

చైనా, దక్షిణ కొరియా వంటి కొన్ని దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు హెచ్చరిలు జారీ చేసింది. కాగా, మన దేశంలో గడిచిన 24 గంటల్లో 2,539 కేసులు నమోదయ్యాయి. కాగా, 60 మరణాలు సంభవించాయి.   

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ ఆందోళనలు కలిగిస్తున్నాయి. చైనా, వియత్నాం, దక్షిణ కొరియా, జర్మనీల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్ బీఏ.2 ఈ కేసులు వెనుక ఉన్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య చర్చకు వస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా బుల్లెటిన్ ప్రకారం, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,539 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, 60 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసులు ఇంతకంటే తగ్గడం లేదు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 0.35 శాతం. ఇదిలా ఉండగా, 24 గంటల్లో 4,491 రికవరీలు జరిగాయి. మొత్తం రికవరీలు 4,24,54,546కు చేరాయి. కాగా, మొత్తం మరణాల సంఖ్య 5,16,132కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 7,17,330 కరోనా టెస్టులు నిర్వహించారు.

మన దేశంలో కరోనా టీకా పంపిణీ కూడా వేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు మొత్తం 180.80 కోట్ల డోసులను పంపిణీ చేశారు. 

ఇదిలా ఉండగా, కొన్ని దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ప్రపంచ దేశాలన్నింటిలో కలవరం కలిగిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గి సుమారు నెల రోజులు గడిచిన తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయని తెలిపింది. నిర్లక్ష్యం కూడదని, ఆంక్షలు ఎత్తేసిన ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. కరోనా టెస్టులు చాలా వరకు తగ్గినప్పటికీ, కేసుల నమోదు పెరుగుతుండటం ప్రమాదకర సరళిని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 463.3 మిలియన్లకు పెరిగాయి. కాగా, ఈ మహమ్మారి కారణంగా 6.05 మిలియన్ల మరణాలు చోటుచేసుకున్నాయి. 

ఇదిలా ఉండగా, కరోనా కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19 టెక్నికల్ లీడ్ మారియా వ్యాన్ ఖెర్కోవ్ స్పందించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన వారాల వ్యవధిలో మళ్లీ పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. కరోనా టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ కేసులు ఎక్కువగా రిపోర్ట్ కావడం ఆందోళనకరం అని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి బలంగా సాగుతున్నట్టు ఆమె అంచనా వేశారు. ముఖ్యంగా కరోనా ఆంక్షలు ఎత్తేసిన ప్రాంతాల్లో కేసులు విపరీతంగా రిపోర్ట్ అవుతున్నాయని ఆమె తన ట్వి్ట్టర్‌ ఖాతాలో వివరించారు.

టీకా పంపిణీ సమృద్ధిగా జరిగినా కరోనా ఆంక్షలు ఎత్తేస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేమని నిపుణులు ఇది వరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే.. టీకాలు కేవలం వైరస్ తీవ్రతతను తగ్గించగలవని, మరనాలను నివారించగలవని, కానీ, వైరస్ సోకకుండా అడ్డుకోలేవని మారియా వ్యాన్ ఖెర్కోవ్ మరోసారి గుర్తు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Suriya & Jyothika to Vote: లైన్లో నిలబడి ఓటు వేసిన హీరో సూర్య, జ్యోతిక | Asianet News Telugu
Vishal Arrives on Bicycle to Vote: సైకిల్ లో వచ్చి ఓటు వేసిన హీరో విశాల్| Asianet News Telugu