
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,15,802 కేసులు రికార్డయ్యాయి. గతంలో అమెరికాలో ఒక్క రోజులో 3.07 లక్షల కేసులు నమోదయ్యాయి.దేశంలో ఇప్పటివరకు 15,924,806 కరోనా కేసులు రికార్డయ్యాయి. కరోనాతో ఒకే రోజు 2,102 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,84,672 కి చేరుకొంది. దేశంలో 2.3 మిలియన్ యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు రికార్డు అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 132 మంది కరోనాతో మరణించారు. రోజూ 2 వేలకు పైగా మరణాలు చోటు చేసుకొంటున్నట్టుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలో రోజు 50 వేలకు పైగా కేసులు రికార్డు అవుతున్నట్టుగా వైద్య శాఖాధికారులు చెబుతున్నారు.
రోజువారీ కేసుల్లో అమెరికాను ఇండియా దాటిపోయింది. అయితే కరోనాతో మరణాల్లో ఇండియా కంటే అమెరికాలో 13 రెట్లు అధికంగా ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత మూడు రోజుల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరిగిందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు.