దైనిక్ భాస్కర్ సహా మరో న్యూస్ ఛానల్‌పై ఐటీ దాడులు.. కేంద్రంపై విపక్షాల ఆగ్రహం

By Siva KodatiFirst Published Jul 22, 2021, 3:26 PM IST
Highlights

ప్రముఖ మీడియా సంస్థలైన దైనిక్ భాస్కర్‌‌తో పాటు భారత్ సమాచార్ ఛానల్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. మీడియా సంస్థలపై దాడులు జరగడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో న్యూస్ ఛానల్‌పై గురువారం ఉదయం ఐటీ దాడులు జరిగాయి. పన్నులు ఎగవేశాయనే అభియోగాలతో ఐటీ అధికారులు ఈ రెండు సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో దైనిక్ భాస్కర్‌కు చెందిన 35 ప్రాంతాల్లో ఏకాలంలో ఐటీ అధికారులు దాడి జరిపారు. ఈ సంస్థ ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. జైపూర్, అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్ కార్యాలయాలపైనా దాడులు జరిగినట్టు దైనిక్ భాస్కర్‌కు చెందిన సీనియర్ ఎడిటర్ తెలిపారు.

ఇక దాడులు జరిగిన మరో సంస్థ ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారత్ సమాచార్ ఛానల్. ట్యాక్స్ డాక్యుమెంట్ల కోసం ఈ ఛానల్ ఎడిటర్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మరోవైపు మీడియా సంస్థలపై దాడులు జరగడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయిందనే కథనాలను ప్రసారం చేసినందుకే ఈ సంస్థలపై ఐటీ దాడులు చేయించారని ఆరోపించాయి. ప్రధాని మోడీ వైఫల్యాలను లేవనెత్తినందుకు ఆ సంస్ధలు మూల్యం చెల్లించుకుంటున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి  జైరామ్ రమేశ్ అన్నారు.

click me!