
రూ.22,842 కోట్లను బ్యాంకులకు ఎగవేసిన కేసులో ఏబీజీ షిప్యార్డ్ మాజీ ఛైర్మన్ రిషి అగర్వాల్ను ప్రశ్నించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ తరహా కేసుల్లో దేశంలో ఇదే పెద్దదని వెల్లడించింది. శనివారం అతని ఇంటిలో సోదాలు నిర్వహించి, నోటీసులు జారీ చేశామని.. అనంతరం ఈ వారం విచారించామని పేర్కొన్నాయి.
బ్యాంకుల కన్సార్టియంను రూ.22,842 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలపై ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్తో పాటు అప్పటి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేష్ అగర్వాల్తో పాటు ఇతరులపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసింది.అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవెటియా, మరో కంపెనీ ABG ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్పై పీనల్ కోడ్, అవినీతి నిరోధక చట్టం ప్రకారం నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, భారత అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం వంటి కేసులు నమోదు చేసింది.
అటు రుణం ఎగవేత ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఏబీజీ షిప్యార్డ్ (ABG Shipyard) లిమిటెడ్, దాని మాజీ ప్రమోటర్లతో పాటు ఇతరులపై మనీలాండరింగ్ క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (cbi) ఫిర్యాదు, ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను అధ్యయనం చేసిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఈడీ కేసు నమోదు చేసింది.
బ్యాంకు రుణాల నిధులను మళ్లించడం, ప్రజల సొమ్మును లాండరింగ్ చేయడానికి షెల్ కంపెనీలను సృష్టించడం, కంపెనీ ఇతర అధికారుల పాత్ర వంటి ఆరోపణలను ED ప్రత్యేకంగా పరిశీలిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. రుణాలను మళ్లించడం ద్వారా కంపెనీ విదేశీ అనుబంధ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన విధానంపై కూడా ఈడీ ప్రముఖంగా విచారణ జరపనుంది. ఇందులో నిందితుల ఆస్తులను అటాచ్ చేసే అవకాశం కూడా ఉంది. గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఏబీజీ షిప్యార్డ్.. ఒకప్పుడు షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్లో కీలకంగా వ్యవహరించింది. దహేజ్, సూరత్లలో వున్న షిప్యార్డ్ల ద్వారా గడిచిన 16 ఏళ్లలో 165 నౌకాలను నిర్మించింది. వీటిలో 46 వరకు ఎగుమతి కోసం వేచి వున్నాయి.
ఇక ఈ సంస్థపై వివిధ బ్యాంకులు చేసిన ఫిర్యాదు ప్రకారం, కంపెనీ వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని చెల్లించకుండా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2,925 కోట్ల రూపాయలు, ఐ సి ఐ సి ఐ బ్యాంక్కు 7,089 కోట్ల రూపాయలు, ఐడీబీఐ బ్యాంక్కి 3,634 కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకి 1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 1,244 కోట్ల రూపాయలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 1,228 కోట్ల రూపాయలు బకాయిలు ఉంది. ఏప్రిల్ 2012 నుండి జూలై 2017 వరకు 18.01.2019 నాటి ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక, నిందితులు కుమ్మక్కయ్యారని, నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంది. నేరపూరిత విశ్వాస ఉల్లంఘన వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని వెల్లడించింది. మొత్తం 22,842 కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు పేర్కొంది.
బ్యాంకు నిధులను విడుదల చేసే ప్రయోజనాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించారని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ తన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. బ్యాంకు నిధుల ఖర్చుతో చట్టవిరుద్ధంగా పొందే లక్ష్యంతో నిధుల మళ్లింపు, దుర్వినియోగం, నేరపూరిత నమ్మకాన్ని ఉల్లంఘించడం ద్వారా మోసం జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఏప్రిల్ 2012, జూలై 2017 మధ్య మోసం జరిగినట్లు చూపిస్తుంది.
కమోడిటీ డిమాండ్, ధరలు తగ్గడం, కార్గో డిమాండ్ తగ్గడం వల్ల గ్లోబల్ సంక్షోభం షిప్పింగ్ పరిశ్రమపై ప్రభావం చూపింది. కొన్ని ఓడలు,ఓడల కోసం ఒప్పందాలను రద్దు చేయడం వల్ల ఇన్వెంటరీ పేరుకుపోయిందని పేర్కొంది . దీని ఫలితంగా వర్కింగ్ క్యాపిటల్ కొరత ఏర్పడింది. ఆపరేటింగ్ సైకిల్లో గణనీయమైన పెరుగుదలకు కారణమైంది. తద్వారా లిక్విడిటీ సమస్య తోపాటు ఆర్థిక సమస్య తీవ్రమైంది. 2015 నుండి పరిశ్రమ తిరోగమనంలో ఉందని పేర్కొంది. వాణిజ్య నౌకలకు డిమాండ్ లేదని పేర్కొన్నారు. ఆర్ధిక నష్టాల కారణంగా గడువు తేదీలో కంపెనీ వడ్డీ, వాయిదాలను చెల్లించలేకపోయింది అని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.