దూసుకొస్తున్న నిసర్గ తుఫాను: వణుకుతున్న గుజరాత్, మహారాష్ట్ర

By Siva KodatiFirst Published Jun 1, 2020, 7:25 PM IST
Highlights

అంపన్ తుఫాను మిగిల్చిన విషాదం నుంచి కోలుకోకముందే భారతదేశానికి మరో తుపాను ముప్పు పొంచి వున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్లు ఆ శాఖ శాస్త్రవేత్తలు వివరించారు

అంపన్ తుఫాను మిగిల్చిన విషాదం నుంచి కోలుకోకముందే భారతదేశానికి మరో తుపాను ముప్పు పొంచి వున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్లు ఆ శాఖ శాస్త్రవేత్తలు వివరించారు.

ఈ అల్పపీడనం గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 370 కి.మీ, ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 690 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి దక్షిణ నైరుతి దిశలో 920 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది.

కాగా ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం వుందని వారు అంచనా వేస్తున్నారు. నిసర్గ అని పిలుస్తున్న ఈ తుపాను జూన్ 3 సాయంత్రానికి దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాలను తాకవచ్చని వారు తెలిపారు.

సూపర్ సైక్లోన్ అంపన్ కొద్ది రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో మరో తుఫాను హెచ్చరిక వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిసర్గ తుఫాను ప్రభావంతో గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర జూన్ 2 నాటికి 105 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు.

ఇక జూన్ 3 సాయంత్రం 5.30 గంటలకు గాలివేగం మరింత ఉద్ధృతమై 125 కిలోమీటర్లకు కూడా చేరవచ్చని అధికారులు తెలిపారు. అంతేకాకుండా జూన్ 3, 4 తేదీల్లో ఆ రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం జూన్ 4 తుపాను బలహీనపడవచ్చని ఐఎండీ ఒక ప్రకటనలో వెల్లడించింది.     

click me!