
Kerala Governor: కేరళలో గవర్నర్కు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రశ్చాన్న యుద్ధం జరుగుతుందా అన్నట్టు ఉంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తుంది. తాజాగా.. తాను ఎవ్వరికీ జవాబుదారీ కానని, కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారినని, రాజ్భవన్ వ్యవహారాల్లో ఎవరైనా వేలు పెట్టాలని చూస్తే.. అసాధారణమైన రాజ్యాంగ సంక్షోభానికే దారితీస్తుందని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా హెచ్చరించారు.
శనివారం గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ భవన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. అసాధారణమైన రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాను ఎవ్వరికీ జవాబుదారీ కాననీ, కేవలం భారత రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారీనని అన్నారు.
మంత్రుల వ్యక్తిగత సిబ్బందిని నియమించే విధానంపై ఆందోళనలను కూడా బహిరంగంగా వెల్లడించారు. కేరళలో మాత్రమే మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి పెన్షన్ ప్రయోజనాలు లభిస్తున్నాయని, ఈ విధానం కేరళలో మాత్రమే ఉందని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు.. తనకి 11 మంది వ్యక్తిగత సిబ్బంది ఉండేవారనీ, కానీ, ఇక్కడ( కేరళ లో) ఒక్కో మంత్రి 20 మందికి పైగా వ్యక్తిగత సిబ్బంది ఉన్నారనీ, వారిలో ఎక్కువ మంది రాజకీయ కార్యకర్తలేననీ, వారు మరొకరికి అవకాశం ఇచ్చినందుకు రెండు సంవత్సరాల తర్వాత ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నారనీ, అనంతరం వారికి పెన్షన్ ప్రయోజనాలు పొందుతున్నారని గవర్నర్ అన్నారు.
గత గురువారం రాజ్భవన్లో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శిని కలిసిన సందర్భంగా ఆయన ఈ డిమాండ్లను లేవనెత్తారు. వ్యక్తిగత సిబ్బందికి చట్టబద్ధమైన పింఛను పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం ఆయన చేసిన విధాన ప్రసంగంలో పేర్కొన్నారు. ఎలాంటి హామీ ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా లేరని, ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. గవర్నర్ వ్యక్తిగత సిబ్బందిలో బిజెపి నాయకుడు హరి ఎస్ కర్త నియామకంపై ప్రభుత్వ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇక ప్రతిపక్ష నాయకుడు VD సతీశన్పై కూడా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకులైన ఊమెన్ చాందీ, రమేశ్ చెన్నితలను చూసి రాజకీయాలు నేర్చుకోవాలని చురకలంటించారు. ఇకశుక్రవారం తనను విమర్శించిన మాజీ న్యాయశాఖ మంత్రి బాలన్.. ఇంకా చిన్న పిల్లల దశ నుంచి బయటకు రావడం లేదని గవర్నర్ ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యలపై బాలన్ స్పందిస్తూ.. తాను చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నానో.. లేదా గవర్నర్ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కెపిసిసి అధ్యక్షుడు కె.సుధాక్రన్ కూడా గవర్నర్ రాజకీయ కుయుక్తులను తప్పుబట్టారు, గవర్నర్ను రీకాల్ చేయాలా వద్దా అనే దానిపై యుడిఎఫ్ చర్చిస్తుందని చెప్పారు.
అలాగే.. గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కనం రాజేంద్రన్ మండిపడ్డారు. రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించలేకపోతే గవర్నర్ రాజీనామా చేయాలని అన్నారు. వ్యక్తిగత సిబ్బంది నియామకంపై గవర్నర్ వైఖరి తగదన్నారు. 157 మంది సిబ్బంది ఉన్న రాజభవనంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. గవర్నర్ పర్యటనలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. లక్షద్వీప్, మున్నార్ పర్యాటన ఖర్చులను మేం అడగడం లేదని ఆయన అన్నారు. గవర్నర్కు ప్రభుత్వం తలొగ్గి ఉండాల్సిందని అన్నారు. గవర్నర్ పదవికి పోటీ చేయబోమని సీపీఐ (ఎం) తెలిపింది. గవర్నర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆడుతున్నారని కానం విమర్శించారు. అలంకారణ ప్రాయంగా ఉంటే.. పదవికీ ఇంత ప్రత్యేకత ఎందుకని కనం విమర్శించారు.