
చెన్నై: ఓ మహిళ వివాహేతర సంబంధం ముగ్గురిని ప్రాణాలు తీసింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి విచారణకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
చెంగల్పట్టు కైలాసనాథర్ ఆలయం వీధికి చెందిన గోపి (38) భార్య కన్నియమ్మాళ్ అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ (45)తో ఐదేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. సురేష్ కు వివాహం అయింది. ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు.
భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి గోపి ఆమెను తీవ్రంాగ మందలించాడు. దాంతో పాటు శుక్రవారంనాడు గోపి, సురేష్ గొడవ పడ్డారు. తర్వాత ఇంటికి వచ్చిన గోపి తన భార్య కన్నియమ్మాళ్ తో గొడవ పడ్డాడు. శనివారం ఉదయం గోపి, కన్నియమ్మాల్ ఇద్దరు కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ ను విచారించడానికి సిద్ధపడ్డారు. అయితే, అతను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీ, కన్నియమ్మాళ్ ఆత్మహత్యతో వారి కూతురు అనాథగా మిగిలిపోయింది.