మణిపూర్ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే, అది దేశానికి భద్రతా సమస్యలను సృష్టించవచ్చు: ఇండియా

Published : Jul 30, 2023, 03:18 PM IST
మణిపూర్ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే, అది దేశానికి భద్రతా సమస్యలను సృష్టించవచ్చు: ఇండియా

సారాంశం

Manipur violence: ప్ర‌తిప‌క్ష పార్టీల ఇండియా కూట‌మి మణిపూర్ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించకపోతే దేశానికి భద్రతా సమస్యలు తలెత్తుతాయ‌నే ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించిన అనంతరం ప్రతిపక్ష ఇండియాకు చెందిన 21 మంది ఎంపీల బృందం మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికేను రాజ్ భవన్ లో కలిసి తమ పరిశీలనలపై మెమోరాండం సమర్పించింది.  

Manipur-INDIA bloc MPs: ప్ర‌తిప‌క్ష పార్టీల ఇండియా కూట‌మి మణిపూర్ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించకపోతే దేశానికి భద్రతా సమస్యలు తలెత్తుతాయ‌నే ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించిన అనంతరం ప్రతిపక్ష ఇండియాకు చెందిన 21 మంది ఎంపీల బృందం మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికేను రాజ్ భవన్ లో కలిసి తమ పరిశీలనలపై మెమోరాండం సమర్పించింది. మ‌ణిపూర్ విష‌యంలో కేంద్రం నిర్ల‌క్ష్యం వీడాల‌నీ, రాష్ట్రంలో శాంతికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే.. మ‌ణిపూర్ హింస నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ప‌లువురు ఎంపీలు రాష్ట్రంలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను తెలుసుకోవ‌డానికి వ‌చ్చారు. మూడు నెలలుగా కొనసాగుతున్న మణిపూర్ జాతి వివాదాన్ని త్వరగా పరిష్కరించకపోతే, అది దేశానికి భద్రతా సమస్యలను సృష్టిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి ఆదివారం పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించిన అనంతరం ప్రతిపక్ష బీజేపీకి చెందిన 21 మంది ఎంపీల బృందం మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికేను రాజ్ భవన్ లో కలిసి తమ పరిశీలనలపై మెమోరాండం సమర్పించింది. సమావేశం అనంతరం రాజ్ భవన్ వెలుపల కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి విలేకరులతో మాట్లాడుతూ.. 'గవర్నర్ మా అభిప్రాయాలను విని వాటికి అంగీకరించారు. హింసపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజల బాధలను వివరించారని' తెలిపారు.

అలాగే, 'సంబంధిత సామాజిక వర్గాల్లో అపనమ్మకాన్ని తొలగించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం మణిపూర్ లో పర్యటించి మైతీ, కుకి ప్రజలతో మాట్లాడాలని గవర్నర్ సూచించారు. ఆ సూచనను మేం కూడా అంగీకరిస్తున్నాం' అని అధీర్ రంజ‌న్ చౌద‌రి తెలిపారు. మణిపూర్ పై తమ అభిప్రాయాలను పార్లమెంట్ లో ప్రవేశపెడతామనీ, అవకాశం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. మణిపూర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పిదాలపై పార్లమెంట్ లో మాట్లాడతామన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మణిపూర్ లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని చౌదరి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

త‌మ రెండు రోజుల పర్యటనలో తమ అనుభవాల గురించి మాట్లాడుతూ, లోయ ప్రజలు (మైతీలు) కొండలకు (కుకీలు నివసించే ప్రదేశం) వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందనీ, కొండ ప్రజలు లోయకు రాలేని విధంగా దారుణ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు. రేషన్, పశుగ్రాసం, పాలు, బేబీ ఫుడ్, ఇతర నిత్యావసర సరుకులకు తీవ్ర కొరత ఏర్పడింది. విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడింది. వీటన్నింటినీ గవర్నర్ కు వివరించామనీ, గ‌వ‌ర్న‌ర్ ఈ సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకోవాలని చెప్పారని తెలిపారు. కాగా, మధ్యాహ్నం ప్రతిపక్ష ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరింది. మణిపూర్ లో మూడు నెలలుగా జరుగుతున్న అల్లర్ల బాధితులను పరామర్శించేందుకు, వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు వారు శనివారం మణిపూర్ చేరుకున్నారు.

రెండు రోజుల సుడిగాలి పర్యటనలో భాగంగా తొలిరోజు ఇంఫాల్, బిష్ణుపూర్ జిల్లాలోని మొయిరంగ్, చురాచంద్ పూర్ లోని పలు సహాయ శిబిరాలను సందర్శించి ఇరు వర్గాలకు చెందిన జాతి ఘర్షణల బాధితులను కలుసుకున్నారు. సుజనా దేవ్ (టీఎంసీ), మహువా మాజి (జేఎంఎం), కనిమొళి కరుణానిధి (డీఎంకే), పీపీ మహ్మద్ ఫైజల్ (ఎన్సీపీ), చౌదరి జయంత్ సింగ్ (ఆర్ఎల్డీ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), ఎన్ కే ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ), టీ తిరుమావళవన్ (వీసీకే) ఈ బృందంలో ఉన్నారు. వీరితో పాటు జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్, ఆయన పార్టీ సహచరుడు అనీల్ ప్రసాద్ హెగ్డే, సీపీఐకి చెందిన సందోష్ కుమార్, సీపీఎంకు చెందిన ఏఏ రహీమ్, ఎస్పీకి చెందిన జావేద్ అలీఖాన్, ఐయూఎంఎల్ కు చెందిన ఈటీ మహ్మద్ బషీర్, ఆప్ కు చెందిన సుశీల్ గుప్తా, వీసీకేకు చెందిన డి రవికుమార్, అరవింద్ సావంత్ (శివసేన-యూబీటీ) లు కూడా ప్రతినిధి బృందంలో ఉన్నారు.

షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా మే 3న కొండ జిల్లాల్లో 'ట్రైబల్ సాలిడారిటీ మార్చ్' నిర్వహించిన తరువాత మణిపూర్లో జాతి ఘర్షణలు చెలరేగడంతో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మందికి పైగా గాయపడ్డారు. కాగా, మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మైతీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజ‌నులైన నాగాలు, కూకీలు 40 శాతం ఉండగా, వీరు కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu