
న్యూఢిల్లీ: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య దేశాన్ని కదిలించింది. ఈ ఏడాది మే 29న పంజాబ్లోని మాన్స జిల్లాలో దుండగులు గన్లతో కాల్పులకు తెగబడి దారుణం అంతమొందించారు. ఈ ఘటన తర్వాత సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కార్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా, ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
‘నా బిడ్డను ఒక పథకం ప్రకారమే చంపేశారు. పోలీసులు దీన్ని ఒక గ్యాంగ్ వార్ ఘటనగా చూపెట్టాలని అనుకుంటున్నారు. నా సమస్యలు చెప్పడానికి డీజీపీని సమయం కావాలని కోరాను. ఒక నెల రోజుల ఎదురుచూస్తా. అప్పటికైనా ఏమీ జరగలేదంటే. నా ఫిర్యాదును వెనక్కి తీసుకుంటా.. ఈ దేశం విడిచిపెట్టి వెళ్లిపోతా’ అంటూ ఆయన ఆవేదనతో మాట్లాడారు.
Also Read: మరో పంజాబీ సింగర్ పై హత్యాయత్నం.. రాపర్ హనీ సింగ్ భావోద్వేగ పోస్టు.. !
మే 29వ తేదీన మాన్స జిల్లాలో సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపారు. ఆయన తన మిత్రులతో కలిసి జిప్సీల ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం వీఐపీలకు సెక్యూరిటీ తగ్గించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఘటన జరిగింది. ఇందులో భాగంగా సిద్ధూ మూసేవాలా సెక్యూరిటీని కూడా తగ్గించారు.
సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత ఇటు పంజాబ్ పోలీసులు.. అటు ఢిల్లీ పోలీసులు చాలా మందిని అరెస్టు చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, ఆయన అనుచరులనూ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.