
కర్ణాటక : రామనగర జిల్లా మాగడిలోని బండేమఠం బసవలింగ స్వామి ఆత్మహత్య కేసులో మొదటి నిందితుడిగా ఉన్నకణ్ణూరు మఠాధిపతి మృత్యుంజయస్వామీజీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. హనీట్రాప్ ద్వారా బసవలింగ స్వామి జీవిత ఉన్న వీడియోలను సేకరించి భారీగా డబ్బు డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమవద్ద గల వీడియో విడుదల చేస్తామని బెదిరింపులకు దిగాడు. ఈ ఉదంతంతో బసవలింగస్వామిజీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృత్యంజయ స్వామి సొంత మఠంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
పోలీసు కస్టడీకి తరలింపు…
బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో అరెస్టైన మృత్యుంజయ స్వామీజీ, నీలాంబిక, మహాదేవయ్యలను రామనగర పోలీసులు సోమవారం మాగడి ఏఎంఎప్ సీ కోర్టులో హాజరు పరిచి మరింత దర్యాప్తు కోసం తమ కస్టడీకి ఇవ్వాలని మనవి చేశారు. న్యాయమూర్తి ధనలక్ష్మీ నవంబర్ 4వ తేదీవరకు వారిని పోలీసు కస్టడీకి ఆదేశించారు. కేసు గురించి డీజీపీ ప్రవీణ్ సూద్ మాట్లాడుతూ బసవలింగస్వామీజీ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఇందులో రహస్యం ఏమీ లేదని అన్నారు.
బసవలింగస్వామి మృతి కేసు : నగ్న వీడియో వైరల్.. హనీ ట్రాప్ వెనుకున్న కుట్ర ఏంటంటే...
మరింతమంది స్వామీజీలకు యువతి వల?
మృత్యంజయ స్వామి, యువతి నీలాంబిక ఇతరులు కలిసి మరింత మంది స్వామీజీలను ఇదేవిధంగా హనీట్రాప్ చేసినట్లు తెలిసింది. నీలాంబిక దొడ్డబళ్లాపురలో పేరొందిన కాలేజీలో ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థిని. చిన్న వయస్సు నుంచి ఓ మఠానికి వెడుతూ పలువురు స్వామీజీలను పరిచయం చేసుకుంది. నీలాంబిక మామ సిద్దగంగ మఠంలో పని చేస్తున్నాడు. తనతో స్నేహంగా మెలిగిన మరింత మంది స్వామీజీల వీడియోలను ఆమె కణ్ణూరు మృత్యంజయ స్వామికి ఇచ్చి ఉండవచ్చునని అనుమానాలు ఉన్నాయి. తద్వారా ఈ బృందం బ్లాక్ మెయిల్ కు పాల్పడి ఉండవచ్చుననే కోణంలోనూ విచారణ సాగుతోంది.