
తిరువనంతపురం: ఓ లాటరీ వ్యాపారి నిజాయితీని పలువురు మెచ్చుకొంటున్నారు. కేరళలో మహిళా వ్యాపారి నిజాయితీ గురించి తెలిసిన వారంతా ప్రశంసలతో ముంచెత్తారు.
కేరళలోని కొచ్చికి చెందిన 37 ఏళ్ల స్మిజ లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. గత ఆదివారం ఆమె దగ్గర అమ్ముడుపోని 12 బంపర్ లాటరీ టికెట్లు ఉన్నాయి. తరచూ టికెట్లు కొనేవాళ్లు కూడా ఎవరూ షాపు దగ్గరకు రాలేదు.
దీంతో ఆమె చంద్రన్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. అతడు ఆ టికెట్లు అన్నీ తానే కొన్నాడు. ఆ రోజు సాయంత్రమే లాటరీ గెలుచుకున్న టికెట్కు సంబంధించిన వివరాలు ప్రకటించారు.. చంద్రన్ కొనుక్కున్న టికెట్లలో ఓ దానికి రూ. 6 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఆమె వెంటనే చంద్రన్ ఇంటికి చేరుకుని టికెట్ను అతడికి అందించింది. దీంతో జనం ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ విషయమై స్మిజ మాట్లాడారు. చంద్రన్కు రూ. 6 కోట్ల టికెట్ను ఇచ్చిన తర్వాత అతడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్పారు. తన నిజాయితీని మెచ్చుకుంటూ అందరూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు.
ఈ వ్యాపారంలో ఇలాంటి వన్నీ మామూలేనని ఆమె తెలిపారు. టికెట్ కొనటానికి డబ్బులకోసం కష్టపడే కస్టమర్ల ద్వారానే మా పూట గడుస్తోందన్నారు. ఈ కారణంగానే తాము నిజాయితీగా ఉండక తప్పదన్నారు.