కశ్మీర్‌లో ఉగ్రవాదుల అరాచకం.. ముగ్గురు పోలీసుల కిడ్నాప్‌.. దారుణ హత్య

By sivanagaprasad kodatiFirst Published Sep 21, 2018, 11:40 AM IST
Highlights

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు.. ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి.. వారిని అత్యంత దారుణంగా హత్య చేశారు. 

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు.. ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి.. వారిని అత్యంత దారుణంగా హత్య చేశారు. షోపియాన్ జిల్లాలో స్పెషల్ పోలీస్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్న ఫిర్దోస్ అహ్మద్ కుచే, కుల్దీప్ సింగ్, నిసార్ అహ్మద్ ధోబీలతో పాటు నిసార్ సోదరుడు ఫయాజ్ అహ్మద్ భట్‌ల ఇళ్లలోకి హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు చొరబడ్డారు.

అనంతరం వారిని అపహరించుకుపోయారు. అయితే గ్రామస్తుల సాయంతో నిసార్ సోదరుడు ఫయాజ్ తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సైన్యం కిడ్నాపైన పోలీసుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ క్రమంలో అపహరించుకుపోయిన పోలీసులను ఉగ్రవాదులు అత్యంత దారుణంగా చంపినట్లుగా తెలుస్తోంది.

‘‘ మీ ఉద్యోగాలకు రాజీనామా చేయండి.. లేదంటే ప్రాణాలు పోతాయి’’ అని ఉగ్రవాదులు ఈ ముగ్గురిని బెదిరించినట్లుగా తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సలావుద్దీన్ కుమారుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం వల్లే ఉగ్రవాదులు పోలీసులను కిడ్నాప్ చేస్తున్నట్లుగా స్థానిక అధికారులు తెలిపారు. గత నెలలో కూడా పోలీసు కుటుంబాలకు చెందిన 8 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి.. అనంతరం క్షేమంగా విడిచిపెట్టారు.

click me!