
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జహంగిర్పరిలో హనుమాన్ జయంతి రోజున మతఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. శాంతి పునస్థాపితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అదే ప్రాంతానికి చెందిన హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అంటూ ముందుకు కదిలారు. వారు స్వయంగా జహంగిర్పురిలో త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని ఆదివారం ర్యాలీ తీశారు. సాయంత్రం 6 గంటలకు ఇక్కడ యాత్ర చేయడానికి ముందస్తుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు.
25 మంది హిందువులు, 25 మంది ముస్లింలు ఈ యాత్ర చేపట్టడానికి అనుమతులు ఇచ్చారని తెలిసింది. ఈ ర్యాలీ కుసల్ చౌక్లో మొదలై అక్కడి నుంచి బ్లాక్ బీ, బీసీ మార్కెట్, మసీదు, దేవాలయం, జీ బ్లాక్, కుసల్ చౌక్, భూమి ఘాట్ల మీదుగా వెళ్లి ఆజాద్ చౌక్లో ముగిసేలా అనుమతులు పొందారు.
శనివారం సాయంత్రం లోకల్ పీస్ కమిటీ ప్రతినిధులు (దీన్నే అమన్ కమిటీ అని కూడా పిలుస్తారు) కెమెరాల ముందు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రెండు వర్గాల మధ్య సహోదరభావాన్ని చాటుకున్నారు. అదే సోదరభావాన్ని వ్యాప్తి చేయాలని భావించారు.
శుక్రవారమే జహంగిర్పురి నివాసులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలు నెలకొనడానికి సహకరించాలని పిలుపు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగరూకతగా మెదలాలని తీర్మానించుకున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ పెద్దమొత్తంలో సెక్యూరిటీ ఉన్నది.
కేంద్ర హోంమంత్రి Amit shah జహంగీర్పురి హింసాత్మక ఘటనలపై ఢిల్లీ అడ్మినిస్టేషన్ తో సోమవారం మాట్లాడినట్లు సమచారం. Jahangirpuri హింసపై ప్రధానంగా బ్రీఫింగ్ సందర్భంగా, Hanuman Jayanti శోభా యాత్ర ఘర్షణలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షా ఆదేశాలు ఇచ్చారని, తద్వారా ఢిల్లీలో ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూడాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 2020 అల్లర్ల తర్వాత ఢిల్లీలో జరిగిన మొదటి మతపరమైన చిచ్చు ఇది. ఏప్రిల్ 16న నగరంలోని జహంగీర్పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రాళ్లదాడి, ఘర్షణల కారణంగా 8 మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు. ఆ తరువాత ఢిల్లీలో భారీ పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు కాలీనడకన, మోటారు సైకిల్ పెట్రోలింగ్తో పాటు ఫ్లాగ్ మార్చ్లు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ దాడి ఘటన మీద జహంగీర్పురి పోలీస్ స్టేషన్లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 147, 148, 149, 186, 307, 323, 332, 353, 427, 436.. ఆయుధాల చట్టంలోని సెక్షన్ 27 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది.