
Karnataka: ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరువు హత్యలు ఆందోళనను పెంచుతున్నాయి. వేరువేరు మతాలకు చెందిన ఓ ప్రేమ జంట వివాహం చేసుకోవాలనుకుంది. ఒకరికొకరంటే ఎంతో ఇష్టం.. కానీ పెద్దలు నో చెప్పారు. ఈ క్రమంలోనే దళిత యువకుడు దారుణంగా పరువు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుందని ఎన్డీ టీవీ నివేదించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముస్లిం మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంగా 25 ఏళ్ల దళిత యువకుడిని హత్య చేయడం కర్నాటకలో సంచలనంగా మారింది. ఈ ఘటనతో కలబురగి జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను పెంచడంతో పాటు అదనపు బలగాలను మోహరించడానికి అధికారులను ప్రేరేపించింది.
వాడి పట్టణంలోని భీమా నగర్ లేఅవుట్లో నివాసముంటున్న విజయ్ కాంబ్లేను సోమవారం రాత్రి రైల్వే బ్రిడ్జి దగ్గర కొందరు వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. దుండగులు అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేయడానికి ముందు వాగ్వాదం జరిగిందని, అతనికి తీవ్ర రక్తస్రావం జరిగిందని చెబుతున్నారు. ఈ ఘటనలో విజయ్ కాంబ్లే అక్కడికక్కడే మృతి చెందాడు. దీని గురించి మృతుడి స్నేహితుడు మీడియాతో మాట్లాడుతూ.. "మేము కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు అక్కడ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా కనిపించారు. మా ముందు ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారు ఎవరో మాకు తెలియదు. వారు అతనిపై దాడికి పాల్పడ్డారు. ఒకరు మారణాయుధంతో అతనిని నరికి చంపారు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు" అని చెప్పాడు.
విజయ్ కాంబ్లే.. ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నారని, అయితే ఆమె కుటుంబ సభ్యులు వారి సంబంధాన్ని వ్యతిరేకించారని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి తల్లి ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లో బాలిక తండ్రి, సోదరుడు తన కుమారుడిని కత్తితో పొడిచి చంపారని ఆరోపించారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. "ఆమె సోదరుడు మరో ఇద్దరితో కలిసి ఇంటికి వచ్చి మమ్మల్ని హెచ్చరించాడు. అతను మా కొడుకుతో.. 'అమ్మాయితో సంబంధాన్ని ముగించుకో' అని మమ్మల్ని హెచ్చరించాడు. నా కొడుకుకు హాని చేయవద్దని మేము వారిని అభ్యర్థించాము .. నా కొడుకు అమ్మాయితో కలవకుండా చూసుకున్నాము. కానీ వారు నా కొడుకును అంతం చేస్తానని ముందే మాకు హెచ్చరించినట్టు ఇప్పుడు చంపేశారు" అని మృతుడి తల్లి బోరున ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంది
కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న.. హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను 19 ఏళ్ల షహబుద్దీన్, మహిళ సోదరుడు19 ఏళ్ల నవాజ్ గా గుర్తించారు.
ఇదిలావుండగా, గత ఏడాది అక్టోబర్లో కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రైల్వే ట్రాక్పై 24 ఏళ్ల ముస్లిం యువకుడి శిరచ్ఛేదం చేయబడిన మృతదేహం కనుగొనబడింది. తరువాత, అతనితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న మహిళ తల్లిదండ్రులతో సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబరు 28, 2021న అర్బాజ్ ముల్లా మృతదేహం లభ్యమైనప్పుడు పోలీసులు మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. తరువాత, బెలగావి పోలీసులు ఆ మహిళ తల్లిదండ్రులు ఈరప్ప మరియు సుశీల కుంభార్ మరియు హిందూ గ్రూపు సభ్యుడు శ్రీ మహారాజా నాగప్ప అలియాస్ పుండలిక్ ముత్గేకర్ తెలిపారు. హత్యలో ప్రధాన నిందితులు రామ్సేన హిందుస్థాన్. ముల్లాతో ఉన్న సంబంధాన్ని బాలిక తల్లిదండ్రులు వ్యతిరేకించారని, దానిని అంతం చేయడానికి నాగప్ప సహాయం కోరారని పోలీసులు తెలిపారు.