
తలపాగా (turban) సిక్కు మతానికి చెందినదని చెప్పే రీతిలో ఇస్లాంలో హిజాబ్ (hijab) ముఖ్యమైన భాగం కాదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) అన్నారు. ముస్లిం బాలికలు అభివృద్ధి చెందకుండా చేయడంలో భాగమే ఈ హిజాబ్ కుట్ర అని ఆయన తెలిపారు. విద్యార్థులు తరగతి గదులకు తిరిగి వెళ్లి చదువును కొనసాగించాలని గవర్నర్ కోరారు.
శనివారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఖురాన్ (Quran) లో హిజాబ్ విషయంలో ఏడుసార్లు ప్రస్తావన ఉందని అన్నారు. అయితే అది మహిళల డ్రెస్ కోడ్తో సంబంధం లేదని చెప్పారు. “ హిజాబ్ వివాదం ముస్లిం బాలికల చదువును ఆపే కుట్ర. ముస్లిం బాలికలు ఇప్పుడు చదువుకుని అనుకున్నది సాధిస్తున్నారు. విద్యార్థులు తమ తరగతి గదులకు తిరిగి వెళ్లి చదువుకోవాలని నేను సూచిస్తున్నాను ’’ అని ఆయన అన్నారు. పాఠశాలల్లో సిక్కులు తలపాగా ధరించడాన్ని అనుమతిస్తున్నారు అనే వాదనపై గవర్నర్ మాట్లాడుతూ.. తలపాగా సిక్కు మతంలో ముఖ్యమైన భాగమని అన్నారు. కానీ ఇస్లాంలో హిజాబ్ విషయంలో అలా లేదని తెలిపారు.
మహిళలకు వారు కోరుకున్నది ధరించడానికి స్వేచ్ఛ ఉందని నొక్కిచెప్పిన గవర్నర్.. వారు పనిచేస్తున్న, పని చేస్తున్న సంస్థ నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. ‘‘ మీకు కావలసినది ధరించడానికి మీకు స్వేచ్ఛ ఉంది. కానీ మీరు ఒక సంస్థతో కలిసి నడుస్తున్నప్పుడు మీరు సంస్థ నియమాలు, నిబంధనలు, డ్రెస్ కోడ్ కు కట్టుబడి ఉండాలి ’’ అని ఆయన తెలిపారు.
గత కొన్ని రోజులుగా కర్నాటక (karnataka), ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో హిజాబ్ పై వివాదం జరుగుతోంది. తొలిసారిగా గత నెల ఉడిపిలోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఈ వివాదం రాజుకుంది. కాలేజీ యూనిఫామ్ నిబంధనలను అతిక్రమించి ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి వస్తున్నారని ఇంకొందరు విద్యార్థులు వాదనలకు దిగారు. క్రమంగా అది పెద్ద వివాదంగా మారింది. క్రమంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా మంటలు రాజేసింది. ఇది రెండు వర్గాల మధ్య వైరంగా మారుతోంది. కర్నాటకలో హిజాబ్ వివాదానికి సంబంధించిన అత్యవసర పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కర్నాటక హైకోర్టు విచారణను కొనసాగిస్తున్నందున ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీలు మూసివేసి ఉంచుతామని కర్ణాటక (karnataka) ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (DCTE) పరిధిలోని ఉన్నత విద్యా శాఖకు చెందిన విశ్వవిద్యాలయాలు, కాలేజీలు ఫిబ్రవరి 16 వరకు మూసివేసి ఉంచుతామని, ఆన్ లైన్ లో క్లాసులు కొనసాగుతాయని తెలిపింది. కాగా విద్యార్థులు ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించరాదని హైకోర్టు (high court) మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో 1-10 తరగతుల పాఠశాలలు ఫిబ్రవరి 14వ తేదీ (సోమవారం) నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఇదిలావుండగా.. హిజాబ్లు ధరించిన బాలికలు అమాయకులని ఉడిపి (udipi) లోని స్కూల్ డెవలప్మెంట్ కమిటీ (sdmc) ఉపాధ్యక్షుడు యశ్పాల్ సువర్ణ శనివారం అన్నారు. వారంతా క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందారని, ఆ తర్వాతే వారు ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.