
Punjab Assembly Polls 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ తరుణంలో కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి చన్నీనా..? సిద్ధూనా..? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి పేరును ఫిబ్రవరి 06వ తేదీ వెల్లడిస్తామని కాంగ్రెస్ అధిష్టానం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్ధిత్వంపై చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ప్రకటన పై చన్నీ స్పందిస్తూ.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయమనీ, సీఎం అభ్యర్ధిగా ఎవరిని ప్రతిపాదించినా.. తాను మద్దతిస్తాననీ, పంజాబీల డిమాండ్ను నెరవేరు స్తున్నందుకు రాహుల్ గాంధీకి తాను ధన్యవాదాలు చెబుతున్నానని చన్నీ తన ట్విట్టర్ లో ప్రకటించారు.
ఈ క్రమంలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం కాంగ్రెస్ హైకమాండ్పై విరుచుకుపడ్డారు. అగ్రస్థానంలో ఉన్న ప్రజలు (హైకమాండ్) బలహీనమైన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని భావిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ పంజాబ్ను తయారు చేయాలంటే.. అది ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. ఈసారి మీరే [ఓటర్లు] ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. పార్టీ అధిష్టానం మాత్రం వారి తాళాలకు అనుగుణంగా డ్యాన్స్ చేసే బలహీనమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని భావిస్తోందనీ, మీకు అలాంటి సీఎం కావాలా? ’’ అని ఓటర్లను నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశ్నించారు.
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని చమ్కౌర్ సాహిబ్, బదౌర్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దింపుతున్నందున పార్టీ అధిష్టానం, ఆయనే మరో మారు సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయనున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న కొద్ది కాలంలోనే చన్నీ తీసుకున్న అనేక ప్రజాకేంద్రీకృత నిర్ణయాలు కొంత మేరకు అధికార వ్యతిరేకతను తగ్గించాయి. మరోవైపు, నవజ్యోత్ సిద్ధూకు కూడా అదే విజన్ ఉందని, పంజాబ్ మోడల్ గా అభివృద్ధి చేస్తారని అతని మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. తిరుగుబాటు మరియు తదుపరి ఫిరాయింపుల విషయంలో ప్రత్యర్థి పార్టీలకు రెండు క్యాంపుల నుండి అభ్యర్థులను నిలబెట్టడానికి ఎటువంటి అవకాశం ఉండదని ఎన్నికలకు ముందే ప్రకటన చేయవచ్చని పార్టీ వర్గాలు ముందుగా తెలిపాయి.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీకి.. పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ మద్దతు పలికారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చన్నీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేయడానికి సమయం ఇవ్వాలని సునీల్ జాఖర్ పేర్కొన్న నేపథ్యంలో సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సునీల్ జాఖర్ వ్యాఖ్యలపై సిద్ధూ స్పందిస్తూ.. రాష్ట్రంలో పార్టీ సీఎంగా ఎవరు ఉండాలనేది తన చేతుల్లో లేదా జాఖర్ చేతుల్లో లేదని అన్నారు. సునీల్ జాఖర్ ఏది చెప్పినా అది కూడా అతని చేతిలో లేదు, నా చేతిలో లేదనీ , ప్రజలే తుది నిర్ణేతలని, వారే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని అన్నారు.
అంతకుముందు గురువారం నాడు, జాఖర్ మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న అందరం అంగీకరిస్తామనీ.. కానీ తాను చన్నీజీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాననీ, చన్నీ సీఎంగా పని చేసింది కొద్ది రోజులైనా.. ప్రజల మన్నన పొందారని అన్నారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ పదవి నుండి వైదొలిగిన తర్వాత.. పార్టీ లో 42 మంది పలికారనీ, కేవలం ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే చన్నీకి మొగ్గు చూపారని సునీల్ జాఖర్ పేర్కొన్నరనీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సునీల్ జాఖర్ .. చన్నీకి మద్దతు పలకడం రాజకీయంగా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. రాబోయే పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ అధిష్టానం తన భర్తను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా.. ప్రకటించకపోయినా.. సిద్ధూ ఒక హీరో అని, ఆయన హీరోగా మిగిలిపోతారని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నదని అన్నారు.
ఎవరు సీఎం అయినా కూడా మంత్రుల మాట వినాలని, వారు ఆమోదించిన ఫైళ్లపై సంతకాలు చేయాలని కౌర్ అన్నారు. మంత్రులు తమ పని తాము చేసే విధంగా సీఎం వ్యవహరించాలని ఆమె సూచించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటిస్తారనేది సర్వత్రా చర్చనీయంగా మారింది.