
India Rains: దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు పొటెత్తి అనేక మంది గల్లంతయ్యారు. కొండచరియలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని ఆయా రాష్ట్రాల నుంచి అందుతున్న రిపోర్టులు పేర్కొంటున్నాయి.
రానున్నా ఐదు రోజులు భారీ వర్షాలు..
భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే ఐదు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్లలో రాబోయే ఐదు రోజులలో భారీ (64.5 నుండి 114.5 మి.మీ) నుండి అతి భారీ (115.6 నుండి 204.4 మి.మీ) వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఐదు రోజుల్లో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గుజరాత్, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.
సాధారణం కంటే అధికంగా వర్షపాతం..
జూలై 6 ఉదయం 8:30 గంటల నుండి జూలై 7 రాత్రి 8:30 గంటల వరకు నమోదైన వర్షపాతంపై భారత వాతావరణ శాఖ (IDM) డేటా ప్రకారం.. తొమ్మిది రాష్ట్రాలు అధిక వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, మిజోరాం, కేరళ రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని పలు చోట్ల ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.
నేడు, రేపు వర్ష బీభత్సమే..
దేశంలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్య భారతదేశం, పశ్చిమ తీరం వెంబడి క్రియాశీల రుతుపవనాల పరిస్థితులు రానున్న ఐదు రోజులలో కొనసాగే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదుకానుంది. భారత్ లో జూలై 9, 10 మధ్య అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రం, కేరళ, మాహే, కోస్తా ఆంధ్ర, యానాం, తెలంగాణ, కర్నాటకల్లో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు తీవ్రత అధికంగా ఉండనుంది.
గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్లలో జూలై 11 వరకు, మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో జూలై 10 న చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 12 వరకు కోస్తా కర్నాటకలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కోస్తా ఆంధ్ర, యానాం మీదుగా, దక్షిణ ఇంటీరియర్ కర్నాటకలో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మహారాష్ట్ర రాజధాని నగరం ముంబయితో పాటు దాని పక్కనే ఉన్న థానే జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, వాయువ్య భారతదేశంలో కూడా రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి. IMD ప్రకారం.. "10వ తేదీన జమ్మూ కాశ్మీర్లో, రానున్ను మూడు రోజులు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.