
HD Kumaraswamy: కర్ణాటకలో 'యోగి మోడల్ ' పనిచేయదని, రాష్ట్రాన్ని బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని అని మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో.. కర్ణాటకకు వెయ్యి మంది మోడీలు వచ్చినా.. ఇక్కడ వారి మోడల్ వర్కవుట్ కాదని కుమారస్వామి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్త హత్యతో మత ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చెలారేగాయి. దీంతో వాటిని నివారించేందుకు అవసరమైతే తాను యోగి ఆదిత్యానాధ్ మోడల్ను అనుసరిస్తానని సీఎం బసవ్రాజ్ బొమ్మై సంచలన ప్రకటన చేసిన నేపధ్యంలో కుమారస్వామి ఈ ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల ఘటనలను హెచ్డి కుమారస్వామి ప్రస్తావిస్తూ.. కర్ణాటకకు ఆ సంస్కృతిని తీసుకువస్తే, బిజెపిని నిర్మూలించి, రాష్ట్రం నుండి తరిమికొడతారని అన్నారు.
యూపీ మోడల్ను అమలు చేసేందుకు వెనుకాడబోం: సీఎం బొమ్మై
బీజేపీ యువమోర్చా సభ్యుడు ప్రవీణ్ నెట్టారు హత్య నేపథ్యంలో గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితి కోరితే మత హింసాత్మక సంఘటనలను నివారించడానికి 'యోగి ఆదిత్యనాథ్ మోడల్'ను అనుసరిస్తానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పరిస్థితిని నిర్వహించడానికి యోగి ఆదిత్యనాథ్ సరైన ముఖ్యమంత్రి అని అన్నారు. బీజేపీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామనీ, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
మంగళవారం రాత్రి దక్షిణ కన్నడలో బీజేపీ యువమోర్చా సభ్యుడు ప్రవీణ్ నెట్టారు హత్య గురయ్యారు. ఈ ఘటనతో కర్ణాటకలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పలు పాంత్రాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే స్కూళ్లకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తాజాగా ఈ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రవీణ్ నెట్టారు కుటుంబ సభ్యులను సీఎం బొమ్మై పరామర్శించి బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకేసులో షఫీక్ బల్లారే, జాకీర్ సవనూరు అనే ఇద్దరు వ్యక్తులను మంగళూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులు అతివాద ఇస్లామిక్ సంస్థ- పీఎఫ్ఐతో తమకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితులకు పీఎఫ్ఐతో లింక్ లు ఉన్నాయని వెలుగులోకి వచ్చిన అనంతరం.. ఈ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.