
జ్ఞాన్వాపి మసీదు ఆవరణలో ఏఎస్ఐ సర్వేపై అలహాబాద్ హైకోర్టు ఆగస్టు 3 వరకు స్టే విధించింది. ఆ రోజున వారణాసి జిల్లా జడ్జి జూలై 21న జ్ఞాన్వాపి మసీదు ఏఎస్ఐ సర్వే ఆర్డర్పై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సవాలుపై హైకోర్టు తన తీర్పును వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత ప్రధాన న్యాయమూర్తి ప్రితింకర్ దివాకర్ ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
మసీదు ప్రాంగణాన్ని (వుజుఖానా మినహా) సర్వే చేయాలని ఏఎస్ఐని ఆదేశించిన వారణాసి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజుమన్ మసీదు కమిటీ నిన్న అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మసీదు ఆవరణలో ఏడాది పొడవునా పూజలు చేసేందుకు అనుమతి కోరుతూ జిల్లా కోర్టులో దాఖలు చేసిన దావాలో భాగస్వామ్యులైన నలుగురు హిందూ మహిళా ఆరాధకులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఉత్తర్వును జారీ చేసింది న్యాయస్థానం.
అయితే మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించేందుకు కొంత వెసులుబాటు కల్పించేందుకు జూలై 24న సుప్రీంకోర్టు.. జూలై 26 సాయంత్రం 5 గంటల వరకు ఏఎస్ఐ సర్వేపై స్టే విధించింది. ఈ స్టేను అలహాబాద్ హైకోర్టు నిన్న గురువారం (జూలై 27) వరకు పొడిగించింది. హిందూ మహిళా ఆరాధకులు పేర్కొన్న విధంగా శాస్త్రీయ సర్వే పూర్తయితే, మసీదు ఆవరణ మొత్తం ధ్వంసం అవుతుందని అంజుమన్ కమిటీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే మసీదు కమిటీ దాఖలు చేసిన ఈ ప్రధాన పిటిషన్లో వారణాసి జిల్లా కోర్టులో హిందూ పార్టీ తరపున దాఖలైన వ్యాజ్యం నిబంధనల మేరకు తగిన ప్రమాణ పత్రాల్లో లేనందున దానిని కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు.
అసలు వివాదమేమిటీ?
జ్ఞానవాపిలో 100 అడుగుల ఎత్తైన ఆది విశ్వేశ్వరుని స్వీయ-వ్యక్త జ్యోతిర్లింగం ఉందని హిందూ పక్షం పేర్కొంది. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని మహారాజా విక్రమాదిత్యుడు సుమారు 2050 సంవత్సరాల క్రితం నిర్మించాడు. అయితే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1664 సంవత్సరంలో ఈ ఆలయాన్ని కూల్చివేశాడు. ఈ స్థలంలోనే ప్రస్తుతం ఉన్న జ్ఞానవాపి మసీదు నిర్మించబడిందని వాదన.
జ్ఞాన్వాపి కాంప్లెక్స్లో పురావస్తు సర్వే నిర్వహించి భూగర్భంలో ఉన్నది ఆలయ అవశేషాలా కాదా అని తేల్చాలని పిటిషనర్లు కోరారు. వివాదాస్పద కట్టడాన్ని కూల్చడమే కాకుండా.. 100 అడుగుల ఎత్తైన జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి.. మసీదు నిర్మాణంలో ఉపయోగించారనేది హిందూ పక్షం వాదన. మసీదు గోడలను కూడా పరిశీలించి అవి ఆలయానికి చెందినవా? కాదా? అని తెలుసుకోవాలి. జ్ఞానవాపి మసీదు కాశీ విశ్వనాథ ఆలయ అవశేషాల నుండి నిర్మించబడిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలను విన్న న్యాయస్థానం ఓ కమిటీని నియమించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాన్ని జ్ఞాన్వాపీ క్యాంపస్లో సర్వే చేయాలని కోరారు.