కరోనా నైట్ కర్ఫ్యూ.... అర్థరాత్రి రోడ్డుపై యువతి చిందులు..!

By telugu news teamFirst Published Apr 17, 2021, 8:41 AM IST
Highlights

ఓ యువతి రాత్రిపూట కర్ఫ్యూ విధించగా.. దానిని పట్టించుకోకుండా.. అర్థరాత్రి రోడ్డు పై చిందులు వేసింది. దీంతో.. పోలీసులు ఆమె పై కేసు నమోదు చేశారు.

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో..  చాలా ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు. తాజాగా.. ఓ యువతి రాత్రిపూట కర్ఫ్యూ విధించగా.. దానిని పట్టించుకోకుండా.. అర్థరాత్రి రోడ్డు పై చిందులు వేసింది. దీంతో.. పోలీసులు ఆమె పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం ఆమె రోడ్డుపై డ్యాన్సులు వేయడం గమనార్హం. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అయితే రాజ్‌కోట్‌కు చెందిన యువతి ప్రిషా రాథోడ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉంది. అయితే వారిని ఆకట్టుకునేందుకు కర్ఫ్యూ రాత్రి డ్యాన్స్‌ చేయాలని రాత్రి 11 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చింది. ఓ ఆంగ్ల పాటకు డ్యాన్స్‌లు చేసి రికార్డు చేసింది. అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 

ఈ వీడియోను చూసిన కొందరు ఆమె కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వివరాలు సేకరించారు. కర్ఫ్యూ ఉల్లంఘించిందని ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అప్పటికే ఆ వీడియోను తాను డిలీట్‌ చేశానని.. ఆ వీడియోను చాలా మంది షేర్‌ చేయడంతో బయటకు వచ్చిందని ఆ యువతి పోలీసులకు వివరణ ఇచ్చింది. ఏది ఏమున్నా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమెపై రాజ్‌కోట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై ఎవరూ కూడా ఇలాంటి తుంటరి పనులు చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

click me!