
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకల విషాదానికి వేదికగా మారింది. పెళ్లి వేడుకలో భాగంగా వరుడు తుపాకీ చేతిలోకి తీసుకుని ఫైర్ చేశాడు. ప్రమాదవశాత్తు ఆ గన్ బుల్లెట్ అక్కడే నిలబడి ఉన్న యువకుడికి తగిలింది. రక్తమోడుతున్న ఆ యువకుడిని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ, ట్రీట్మెంట్ చేస్తుండగానే మరణించాడు. వరుడికి తుపాకీ ఇచ్చిందే.. ఆ యువకుడు కావడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సోన్ భద్రర జిల్లా బ్రహ్మనగర్ ఏరియాలో చోటుచేసుకుంది.
వీడియోలో ఆ పెళ్లి కొడుకు మనీష్ మధేసియా కనిపిస్తున్నాడు. పెళ్లి తంతులో భాగంగా వరుడు రథం ఎక్కి నిలబడి ఉన్నాడు. గన్ తీసుకుని ఆకాశానికి వేసి చూపాడు. మళ్లీ కిందకు తీసుకున్నాడు. కానీ, ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కారో సరిగా కనిపించలేదు. గన్ ఆకాశానికి చూపి కిందకు తీసుకోగానే ఫైర్ అయింది. ఆ బుల్లెట్ పెళ్లి కొడుకు మిత్రుడు బాబు లాల్ యాదవ్కు తగిలింది. బాబు లాల్ యాదవ్ ఆర్మీ జవాన్. బాబు లాల్ యాదవ్.. పెళ్లి కొడుకు మనీష్ మధేసియాకు మిత్రుడు. బాబు లాల్ యాదవ్కు చెందిన గన్నే పెళ్లి కొడుకు మనీష్ మధేసియా వినియోగించాడు.
వరుడు ఫైరింగ్ తంతును వేడుక చేసుకుంటూ ఆ ఘటనను చాలా మంది వీడియో తీశారు. అందులో వరుడు ఫైర్ చేసిన ఘటన స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనపై సోన్భద్ర ఎస్పీ అమరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడారు. ఈ ఘటనను ఆయన ధ్రువీకరించారు. పెళ్లి కొడుకు, మరణించిన యువకుడు మిత్రులేనని చెప్పారు. ఫైరింగ్ జరిగిన వెంటనే బాబు లాల్ యాదవ్ను హాస్పిటల్కు తరలించారని, కానీ, ట్రీట్మెంట్ జరుగుతుండగా మరణించాడని తెలిపారు.
కాగా, మరణించిన యువకుడి కుటుంబం.. పెళ్లి కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఫైర్ చేసిన గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మన దేశంలో ఎలాంటి వేడుకలైనా.. పెళ్లిళ్లు, పవిత్ర ప్రదేశాల్లోనూ గన్ ఫైరింగ్ నేరపూరితమైన చర్య.