పెళ్లికి పెళ్లి కొడుకు వస్తుంటే ఎలా ఉంటుంది.. ఆ దర్జా, డాబు, సందడి మామూలుగా ఉండదు. కానీ పంజాబ్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అపశృతి చోటు చేసుకుని పెళ్లికొడుకు మురికి కాల్వలో పడి గాయాల పాలయ్యాడు.
పెళ్లికి పెళ్లి కొడుకు వస్తుంటే ఎలా ఉంటుంది.. ఆ దర్జా, డాబు, సందడి మామూలుగా ఉండదు. కానీ పంజాబ్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అపశృతి చోటు చేసుకుని పెళ్లికొడుకు మురికి కాల్వలో పడి గాయాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... ఘజియాబాద్ ఇందిరాపురానికి చెందిన అమిత్ యాదవ్కు సోనమ్ అనే యువతితో పెళ్లి కుదిరింది.
వివాహాన్ని పంజాబ్లోని హోషియాపూర్లో ఈ నెల 9న ఏర్పాటు చేశారు. వేదిక వద్దకు ఇరు కుటుంబాల వారు వచ్చి వేచి వున్నారు. అయితే ఫంక్షన్ హాల్కు రోడ్డుకు మధ్య చిన్న పాటి మురుగు కాల్వ ఉంది. వివాహానికి వచ్చే వారి కోసం ఈ డ్రైనేజిపై తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.
అయితే వరుడిని ఆహ్వానించేందుకు వధువు కుటుంబ సభ్యులు ఫంక్షన్ హాల్ వద్ద నిలబడ్డారు. అదే సమయంలో పెళ్లికుమారుడితో పాటు ఆయన స్నేహితులు, ఇతర బంధువులు డ్యాన్స్ చేసుకుంటూ తాత్కాలిక బ్రిడ్జిని దాటుతున్నారు.
ఈ సమయంలో ఆ వంతెన కుప్పకూలిపోయింది. దీంతో వరుడితో పాటు మరో 14 మంది మురుగు కాల్వలో పడిపోయారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారు. వెంటనే స్పందించిన తోటి బంధువులు వారిని మురికి కాల్వ నుంచి పైకి లాగి.. అనంతరం ఆస్పత్రికి తరలించారు.
అయితే ఈ ఘటనకు ఫంక్షన్ హాల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని వరుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తూ..ఆందోళనకు దిగారు. స్పందించిన యాజమాన్యం వరుడి కుటుంబానికి రూ. 3 లక్షలు పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.