KTR on Fuel prices: ఆ విష‌యంలో.. ప్ర‌ధాని మోడీ క్ష‌మాప‌ణ చెప్పాలి: కేటీఆర్ డిమాండ్

Published : Apr 07, 2022, 12:15 AM IST
KTR on Fuel prices: ఆ విష‌యంలో.. ప్ర‌ధాని మోడీ క్ష‌మాప‌ణ చెప్పాలి: కేటీఆర్ డిమాండ్

సారాంశం

KTR on Fuel prices: దేశంలో పెరుగుతున్న పెట్రో, డిజిల్ ధ‌ర‌ల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బుధ‌వారం బహిరంగ లేఖ రాశారు. పెట్రో ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో కేంద్రం విఫ‌లమైంద‌ని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాకుగా చూపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పెరుగుతున్నాయ‌ని, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నార‌ని, ఈ విష‌యంలో ప్ర‌ధాని దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.   

KTR on Fuel prices: దేశంలో పెరుగుతున్న పెట్రో, డిజిల్ ధ‌ర‌ల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ.. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బుధ‌వారం బహిరంగ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా పెట్రో ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌లమైంద‌ని ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాకుగా చూపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పెరుగుదలపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని. ఈ విష‌యంలో ప్ర‌ధాని దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 
 
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉటంకిస్తూ.. రష్యా నుండి భారత్ ఒక శాతం కంటే తక్కువ ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని, ఈ వాస్తవాన్ని దాచిపెట్టి.. యుద్దం కార‌ణంగా.. ఇంధన ధరలు పెరుగుతున్నాయని, కేంద్ర‌ప్ర‌భుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇరాక్, సౌదీ అరేబియా, నైజీరియా, యుఎఇ మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశం పెట్రోలియం ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందనీ, ఈ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవని, రష్యా నుంచి సరఫరా సమస్యలు ఉన్నాయని కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించడంలో కేంద్రం విఫలమైంద‌నీ,  ధ‌ర‌ల‌ను ఇష్టానుసారంగా పెంచుతూ.. పచ్చి అబద్ధాలు చెబుతోందని, తప్పుడు సాకులు చెబుతోందని కేటీఆర్ విమ‌ర్శించారు.  అమెరికా, కెనడా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని, అయితే అది నిజం కాదని ఆయన అన్నారు.

“ఈ దేశాలన్నింటిలో పెట్రోలు ధరలు భారతదేశం కంటే చాలా తక్కువగా ఉన్నాయ‌ని..  ఆర్థికంగా దెబ్బతిన్న శ్రీలంకలో కూడా ధర ఇప్పటికీ గణనీయంగానే ఉంది. అయితే ఈ వాస్తవాలన్నింటినీ ఉద్దేశపూర్వకంగా ప్రజలకు పంచడం లేదని మంత్రి కేటీరామారావు ఆరోపించారు. పెట్రోలు ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజల తరపున కోరుతున్నానని  అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇంధన ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారని, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఇప్పుడు ప్రధానమంత్రి ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. ప్ర‌ధాని మోడీ 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' నినాదాన్ని రూపొందించారు, కానీ అది ఇప్పుడు అతని పాలనలో ఇప్పుడు 'సబ్ కా సత్యనాష్ గా మారిపోయింద‌ని ఎద్దేవా చేశారు.  

దోపిడీ ల‌క్ష్యంగా పీఎం పెట్రో ప‌న్ను యోజ‌న ప‌థ‌కం తీసుకొచ్చార‌ని ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు మంత్రి కేటీఆర్. పెట్రో ధ‌ర‌ల పెంపుతో దేశ ప్ర‌జ‌ల‌పై రూ.26.51 ల‌క్ష‌ల కోట్ల మేర భారం ప‌డింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. దోపిడీ కూడా దేశం కోసం, ధ‌ర్మం కోస‌మేనా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా పెట్రో ధ‌ర‌ల బాదుడు ఆప‌కుంటే.. ప్ర‌జ‌లు బీజేపీని తిర‌స్క‌రించ‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ జోస్యం చెప్పారు.

2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.70.51 కాగా, డీజిల్ ధర రూ.53.78గా ఉందని..  బిజెపి పాల‌న‌లో పెట్రోల్, డిజిల్ రేట్లు వరుసగా రూ.118.19 , రూ.104.62కి చేరుకున్నాయ‌నీ,  ప్రస్తుతం, ముడి చమురు ధర బ్యారెల్‌కు 106 యుఎస్ డాలర్లు, ఇది 2014 ముడి చమురు ధరతో సమానం. అయినప్పటికీ, దేశంలో చ‌మురు ధ‌ర‌లు పెరుగుతునే ఉన్నాయ‌ని ఆరోపించారు.  

ఇంధన ధరల పెరుగుదలకు గల కారణాలపై బిజెపి నాయకులు ప్రజలకు సమాధానమివ్వాల‌ని కోరారు. , కరోనా సంక్షోభ సమయంలో ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం పేద,మధ్య తరగతి ప్రజల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. పెట్రో ధరల పెంపును సవరించకపోతే ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారని హెచ్చరించారు.

పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ప్రజలు తీవ్ర‌ అసౌకర్యానికి గుర‌వుతున్నార‌నీ,  ఇప్పటికే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్లు, పప్పులు, మందుల ధరలు భారీగా పెరిగాయనీ, చాలా మంది ప్రజలు తమ వాహనాలను ఉపయోగించడం మానేశారని, రైతులకు వ్యవసాయ పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయని విమ‌ర్శించారు.   తమ ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని, పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించడంలో విఫలమైనందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం