
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అల్లర్లు, హింసతో ఇంకా అట్టుడికిపోతూనే వుంది. కుకీ, మియితీ తెగల మధ్య చెలరేగిన రిజర్వేషన్ వివాదం రోజురోజుకు మరింత తీవ్రరూపు దాల్చుతోంది. ఇరు వర్గాలకు చెందిన నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ.. ఇప్పుడు రాజకీయ నాయకుల ఇళ్లను కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా , చురచంద్పూర్ జిల్లాలోని కంగ్వాయ్ ప్రాంతాల్లో గత రాత్రి ఆటోమేటిక్ ఆయుధాల వినియోగించినట్లుగా పోలీసులు, ఆర్మీ వర్గాలు తెలిపాయి.
అలాగే లంగోల్లో ఖాళీగా వున్న ఇంటికి కూడా దుండగులు నిప్పు పెట్టారు. గుంపులు గుంపులుగా సంచరించడం, విధ్వంసానికి ప్రయత్నించడం , ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ, అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ , రాష్ట్ర పోలీస్ బలగాలు ఇంఫాల్ తూర్పు జిల్లాలో అర్ధరాత్రి వరకు ఫ్లాగ్ మార్చ్ చేపట్టాయి.
ALso Read: మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితిపై తక్షణం దృష్టి పెట్టాలి - ఆర్మీ మాజీ చీఫ్ వేద్ ప్రకాశ్ మాలిక్
అడ్వాన్స్ హాస్పిటల్ సమీపంలోని ప్యాలెస్ కాంపౌండ్ దహనానికి అల్లరి మూకలు ప్రయత్నించాయి. దాదాపు 1000 మంది గుంపు నిన్న సాయంత్రం దహనం , విధ్వంసానికి ప్రయత్నించాయి. గుంపును చెదరగొట్టడానికి ఆర్ఏఎఫ్ టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. మణిపూర్ యూనివర్సిటీ సమీపంలో కూడా గుంపులు సంచరించినట్లుగా సమాచారం. రాత్రి 10.40 గంటలకు తొంగ్జు సమీపంలో 200 నుంచి 300 మంది స్థానిక ఎమ్మెల్యే నివాసాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక గుంపును చెదరగొట్టింది.
ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఇరింగ్ బామ్ పోలీస్ స్టేషన్లోని ఆయుధాగారాన్ని ధ్వంసం చేసేందుకు రాత్రి మరో గుంపు ప్రయత్నించడం కలకలం రేపింది. రాత్రి 11.40 గంటలకు 300 నుంచి 400 మంది పోలీస్ స్టేషన్ను ముట్టడించేందుకు ప్రయత్నించగా.. ఆర్ఏఎఫ్ వారిని చెదరగొట్టింది. ఆర్మీ వర్గాల ప్రకారం.. సింజెమై వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత 200 నుంచి 300 మంది బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టగా, సైన్యం వారిని చెదరగొట్టింది. ఇదే గుంపు అర్ధరాత్రి ఇంఫాల్ వెస్ట్లోని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అధికారమయుమ్ శారదా దేవి నివాసం వద్ద విధ్వంసానికి ప్రయత్నిచంగా.. సైన్యం వారిని అడ్డుకుంది. కాగా.. 1200 మంది గుంపు పెట్రోల్ బాంబులు పేల్చి కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిని దగ్థం చేసిన ఒకరోజు తర్వాత మణిపూర్లో ఈ దాడులు జరిగాయి.