
దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరొకరు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు.. కర్ణాటకలోని రాయచూరుకు చెందిన షఫీ సుల్లెదా వ్యవసాయ విశ్వవిద్యాలయం సైన్స్ వైస్ ఛాన్సలర్కు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నాడు. అతను తన కుటుంబ సభ్యులతో కలిసి ఫిబ్రవరి 14న రాయచూరు నుంచి మక్కాకు వెళ్లారు. అయితే బుధవారం వారు ప్రయాణిస్తున్న బస్సు కంటైనర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో షఫీ సుల్లెదా (53), అతని భార్య షిరాజ్ బేగం (47), కుమార్తె షిఫా (20), తల్లి బీబీ జాన్ (64) మరణించారు. ఈ ప్రమాదంలో షఫీ సుల్లెదా కుమారుడు సమీర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతనికి దుబాయ్లోని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలను రాయచూరు ఎస్పీ బి నిఖిల్ ధ్రువీకరించారు.
‘‘మేము కేసుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నాము. అధికారులు బాధితుల కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నారు’’ అని తెలిపారు. ఇక, ఈ ఘటనతో భారత్లో మృతుల బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొంది.