బర్త్ డే రోజే ఉమ్మడి ఎపి మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ మృతి

By pratap reddyFirst Published Oct 18, 2018, 5:14 PM IST
Highlights

తివారీ మృతికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. 

న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్టీ తివారీ గురువారం కన్ను మూశారు. ఆయన తన 93వ జన్మదినం రోజునే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సాకేత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 

జ్వరం, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనను పది రోజుల క్రితం  ఆసుపత్రిలో చేర్చారు. రక్త పీడనం తీవ్ర స్థాయిలో పడిపోవడంతో పరిస్థితి విషమించిందని, వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందించామని వైద్యులు చెప్పారు. వైద్యానికి ఆయన శరీరం సహకరించకపోవడంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు. 

ఆయన యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తివారి 2007 ఆగస్టు 19న ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆగస్టు 22న గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. 

డిసెంబర్ 26, 2009న గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. 1967 నుంచి 1980 మధ్యలో తివారి కేంద్రమంత్రిగా పనిచేశారు. 1967లో జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు.

తివారీ మృతికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. 

click me!