
Prayagraj Kumbh Mela : మహాకుంభ్ 2025 లోని ఓడీఓపీ ప్రదర్శనలో గాజియాబాద్ కు చెందిన ఓ కంపనీ ఓ విచిత్రమైన పిండమరను ప్రదర్శించింది. సైకిల్ మాదిరిగా పెడల్ తొక్కుతూ పిండమరను నడిపించాలి. దీనివల్ల వ్యాయామానికి వ్యాయామం...పిండికి పిండి వస్తుందని చెబుతున్నారు. ఈ మిషన్ ద్వారా భక్తులు ఉచితంగానే పిండి పట్టుకునే ఏర్పాటుచేసింది సదరు కంపనీ.
ఈ మిషన్ 20 నిమిషాల్లో ఒక కిలో గోధుమలు, మొక్కజొన్న, జొన్న లేదా సజ్జలను పిండిగా మారుస్తుంది. దీన్ని ఇంట్లో చిన్న జిమ్ లాగా వాడుకోవచ్చు. మిషన్ నడపడానికి పెడల్ తొక్కాలి, దాంతో వ్యాయామం అవుతుంది.
ఈ పిండి మిషన్ కంపనీ ప్రతినిధి మాట్లాడుతూ... జిమ్ లేదా యోగా చేయడానికి సమయం లేని వారి కోసం ఈ మిషన్ తయారు చేశామన్నారు. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు దీన్ని సులభంగా వాడుకొని పిండి పట్టుకోవచ్చని చెప్పారు. పెడల్ తొక్కినప్పుడు మిషన్ లోకి ధాన్యం వెళ్లి పిండిగా మారుతుంది. సైకిల్ లా ఉండే ఈ మిషన్ ఎలక్ట్రిక్ గ్రైండర్ కి ప్రత్యామ్నాయం, పర్యావరణహితం కూడా అని తెలిపారు.
ఓడీఓపీ ప్రదర్శనలో ఈ మిషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. భక్తులు దీన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఈ మిషన్ వినియోగించడానికి ఈజీగా వుండటం...రోజూ ఉపయోగకరంగా వుండటమే ప్రత్యేకంగా నిలిపాయి. గాజియాబాద్ కంపెనీ ఈ పిండి మర మహాకుంభ్ 2025 లో కొత్తదనానికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది.