కరోనా ఉద్ధృతి.. వ్యాక్సినేషన్, సామాజిక దూరమే మందు : సీఎంలకు మోడీ సూచన

By Siva KodatiFirst Published Jan 13, 2022, 6:25 PM IST
Highlights

పండుగ సమయంలో మరింత అప్రమత్తంగా వుండాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచించారు. కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రధాని దేశ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. 

పండుగ సమయంలో మరింత అప్రమత్తంగా వుండాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచించారు. కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రధాని దేశ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. కోవిడ్‌పై వ్యాక్సినే అతిపెద్ద ఆయుధమని.. కరోనా వ్యాప్తి కట్టడిపైననే దృష్టిపెట్టాలని మోడీ సూచించారు. దేశంలో 3 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ చేశామని ఆయన తెలిపారు. 

కాగా.. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన రెండున్నర లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ (video conference) నిర్వహిస్తున్నారు. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల గురించి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, వ్యాక్సినేషన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను ప్రధాని సమీక్షించనున్నారు. కాగా, ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాలేదని సమాచారం. 

మరోవైపు భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజువారి కొత్త కేసులు సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,47,417 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. అయితే గత 8 నెలల కాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా కరోనాతో 380 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,85,035కి చేరింది. 

దేశవ్యాప్తంగా నిన్న కరోనా నుంచి  84,825 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,47,15,361కి చేరింది. రికవరీ రేటు 95.59 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల శాతం 3.08గా ఉంది. 

ప్రస్తుతం దేశంలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే వీక్లీ పాజిటివిటీ రేటు 10.80 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. బుధవారం దేశంలో 76,32,024 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కి చేరింది. కరోనా పరీక్షల విషయానికి వస్తే.. జనవరి 12న దేశవ్యాప్తంగా 18,86,935 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు మొత్తంగా 69,73,11,627 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా వెల్లడించింది. 
 

click me!