
మహారాష్ట్రలో రైలు పట్టాలు తప్పింది. LTT-Jaynagar Express కొన్ని కోచ్లు ఆదివారం నాశిక్ సమీపంలోని లహవిత్ – దేవ్లాలి మధ్య పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే CPRO ధృవీకరించారు. మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. రైలులోని కొన్ని కోచ్లు పట్టాలు తప్పడంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఘటన స్థలంలో రెస్క్యూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, వైద్య సామాగ్రితో కూడిన వ్యాన్ ఘటన స్థలానికి చేరుకన్నాయని సెంట్రల్ రైల్వే CPRO వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇక, రైలు పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది.
ఈ ప్రమాదంపై సమాచారం కోసం CSMT స్టేషన్ TC కార్యాలయంలో హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్టుగా రైల్వే శాఖ తెలిపింది. రైల్వే : 55993, MTNL: 02222694040, హెల్ప్లైన్ నెం- 022 67455993 కు ఫోన్ చేయవచ్చని పేర్కొంది. భుసావల్ డివిజన్లో రైలు పట్టాలు తప్పడంతో.. కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా, మరికొన్ని రైళ్లను రూట్ మళ్లించినట్టుగా రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్లో సెంట్రల్ రైల్వే పోస్టు చేసింది.