నిరసనలతో న్యూఢిల్లీ గొంతు కోశారు: రైతు సంఘాలపై సుప్రీం సీరియస్ వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Oct 1, 2021, 1:44 PM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల పేరుతో న్యూఢిల్లీ నగరం గొంతు కోసి చంపారని సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో కిసాన్ మహా పంచాయిత్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

న్యూఢిల్లీ:నూతన వ్యవసాయ చట్టాలకు (new farm laws)వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతుల నిరసనలతో  న్యూఢిల్లీ (new delhi) నగరం గొంతు కోసి చంపారని సుప్రీంకోర్టు (supreme court)తీవ్ర వ్యాఖ్యలు చేసింది.నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ న్యూఢిల్లీ జంతర్ మంతర్ (jantar mantar) వద్ద సత్యగ్రహనికి అనుమతి ఇచ్చేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని  దాఖలు చేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నాడు విచారణ నిర్వహించింది. కిసాన్ మహా పంచాయిత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇప్పటికే నగరం గొంతు నొక్కేస్తున్నారు. మరోవైపు హైవేలను అడ్డుకొంటున్నారు. నగరంలో ప్రవేశించి ఇక్కడ నిరసన తెలపాలనుకొంటున్నారా అని జస్టిస్ ఖాన్విల్కర్ రైతు సంఘాల నేతలను ప్రశ్నించారు.సుప్రీంకోర్టులో ఈ చట్టాలను సవాల్ చేసిన తర్వాత కూడ రైతు సంఘాలు ఎందుకు నిరసనను కొనసాగిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

కోర్టును ఆశ్రయించిన తర్వాత న్యాయ వ్యవస్థ తన పనిని చేసుకోనివ్వాలని కోరారు. మీరు నిరసనలను కొనసాగిస్తూనే జాతీయ రహదారులను దిగ్భంధిస్తున్నారని కోర్టు గుర్తు చేసింది. తమను విశ్వసించాలని ఉన్నత న్యాయస్థానం రైతులను కోరింది.జాతీయ రహదారులు, ప్రజా రహదారులపై నిరసన విషయమై సమీపంలో నివసించే పౌరుఅ అనుమతి తీసుకొన్నారా అని రైతులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ప్రజా రహదారులపై స్వేచ్చగా కదిలేలా ఉపయోగించే హక్కును హరిస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  రక్షణ సిబ్బందిని కూాడా అడ్డుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలీసులు హైవేలను అడ్డుకొన్నారని రైతులు కాదని మహా పంచాయిత్ తరపు న్యాయవాది అజయ్ చౌదరి తెలిపారు. రైతులు మాత్రం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని ఆయన చెప్పారు.హైవేలను దిగ్భంధించి చేపట్టే నిరసన కార్యక్రమంలో తాము భాగం కాదని అఫిడవిట్ దాఖలు చేయాలని కూడ కోర్టు రైతు సంఘలను ఆదేశించింది.

click me!